వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌: కంపెనీల కొత్త వ్యూహం

26 Sep, 2021 09:16 IST|Sakshi

Work From Home To Offices: వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు శుభంకార్డ్‌ వేయాలని కంపెనీలు భావిస్తున్న తరుణంలో..  ఉద్యోగులు మాత్రం కమ్‌బ్యాక్‌కు ససేమీరా చెప్తుండడం కంపెనీలకు కొత్త తలనొప్పి తెచ్చిపెడుతోంది.  ఇప్పటికే కమర్షియల్‌ కార్యకలాపాలు నిలిచిపోగా,  బిల్డింగ్‌ల అద్దె చెల్లింపులు, ఇతరత్ర మెయింటెనెన్స్‌ ఖర్చులతో భారీగా నష్టపోయిన కంపెనీలు.. ఇక మీదట భరించేందుకు సిద్ధంగా లేవు. ఈ క్రమంలోనే ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించేందుకు కొత్త స్ట్రాటజీని ఫాలో అవ్వాలని నిర్ణయించుకున్నాయి. 


స్వదేశీ టెక్‌ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌) ..  వర్క్‌ఫ్రమ్‌ హోంలో ఉద్యోగుల్ని వీలైనంత త్వరగా ఆఫీసులకు రప్పించే ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఈ ఏడాది చివరికల్లా లేదంటే వచ్చే ఏడాది జనవరి నుంచి ఆఫీసుల్లో ఎంప్లాయిస్‌ సందడిని పెంచేదిశగా ప్రణాళిక సిద్ధం చేసింది. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలను సైతం పట్టించుకోకుండా ఉద్యోగులు ఆఫీసుకు రావాలనే ఆసక్తి చూపిస్తున్నారంటూ వరుస ప్రకటనలు చేస్తోంది కూడా. అంతేకాదు ఉద్యోగులకు ఆరోగ్య భద్రత, శుభ్రతతో కూడిన ఆఫీసు వాతావరణం అందిస్తామని హామీతో పాటు రాబోయే కాలంలో కచ్చితంగా వర్క్‌ఫ్రమ్‌ హోం అమలు చేస్తామని ఎంప్లాయిస్‌కు మాట ఇస్తోంది.

 

వాళ్లలా కాకుండా..
గూగుల్‌, మైక్రోసాఫ్ట్, యాపిల్‌ లాంటి టెక్‌ దిగ్గజ కంపెనీలు.. వర్క్‌ఫ్రమ్‌ హోంకి ముగింపు పలికేందుకు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. మెయిల్స్‌ ద్వారా ఉద్యోగులకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఉద్యోగుల నుంచి రాజీనామాల బెదిరింపులు కూడా ఎదురవుతున్నాయి. దీంతో తలొగ్గుతున్న కంపెనీలు.. వర్క్‌ఫ్రమ్‌ ఆఫీస్‌ను కొంతకాలం వాయిదా వేయడంతో పాటు ‘జీతం కోత’ కండిషన్ల మీద వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌కు ఉద్యోగులకు అనుమతులు ఇస్తున్నాయి.  కానీ, టీసీఎస్‌ ఇందుకు భిన్నంగా ప్రవర్తిస్తోంది. రియల్‌ టైం ఆఫీస్‌ వర్క్‌ ద్వారా ఎక్కువ ప్రొడక్టివిటీని సాధించేందుకు మొగ్గు చూపుతోంది. ఉద్యోగుల పట్ల కఠినంగా కాకుండా.. సున్నితంగా వాళ్లను ఆఫీసులకు రప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వ్యాక్సినేషన్‌ సహా అన్నిరకాల భద్రతల హామీ ఇస్తుండడంతో.. ప్లాన్‌ సూపర్‌ సక్సెస్‌ అవుతోంది. ఇందుకోసం ఐబీఎం తరహా ప్రణాళికను(రాబోయే రోజుల్లో హైబ్రిడ్‌ విధానం) టీసీఎస్‌ ఫాలో కావడం విశేషం. ఈ ఐడియా సత్ఫలితాలను ఇస్తుండడంతో మిగతా కంపెనీలు టీసీఎస్‌ బాటలోనే పయనించాలని నిర్ణయించుకున్నాయి.

ఉద్యోగ.. ఆరోగ్య భద్రతకు హామీ
క్రమం తప్పకుండా హైకులు, ఇతర అలవెన్సులు ఇస్తామనే ప్రకటన
ప్రోత్సాహకాలు, నజరానాలు, అదనంగా టూర్లు, ఫ్యామిలీ ప్యాకేజీ టూర్ల ఆఫర్‌
షిప్ట్‌మేనేజ్‌మెంట్‌.. ఉద్యోగికి తగ్గట్లు ఫ్లెక్సీబిలిటీ 
ఎప్పటికప్పుడు ఉద్యోగుల నుంచి ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవడం 
వర్క్‌స్పేస్‌ ప్లానింగ్‌
అత్యవసరమైతే వర్క్‌ఫ్రమ్‌ హోంకి కొన్నాళ్లపాటు అనుమతి

మరోసారి స్పష్టీకరణ
టీసీఎస్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ ఎన్‌జీ సుబ్రమణియం ఆమధ్య ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. వీలైనంత త్వరగా ఎనభై నుంచి తొంభై శాతం మంది ఉద్యోగుల్ని ఆఫీసులకు రప్పించే ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు తెలిపారాయన.  అంతేకాదు హైబ్రిడ్‌ వర్క్‌ కల్చర్‌ (25 శాతం ఉద్యోగులతో ఆఫీసుల్ని.. దశలవారీగా మిగతా వాళ్లతో వర్క్‌ఫ్రమ్‌ హోం)ను 2025 నుంచి అమలు చేయాలనే ఆలోచన ఉన్నట్లు తెలిపారు. ఈ గ్యాప్‌లో బిల్డింగ్‌లను వేరే వ్యవహారాల కోసం వినియోగించుకోవాలని, ఖర్చులు తగ్గించుకోవాలని టీసీఎస్‌ భావిస్తోంది. దీనికి కొనసాగింపుగా తాజాగా టీసీఎస్‌ సీఈవో రాజేశ్‌ గోపినాథన్‌ ప్రకటన చేశారు. థర్డ్‌ వేవ్‌ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకుంటూనే.. వర్క్‌ఫ్రమ్‌ఆఫీస్‌ కార్యాకలాపాల దిశగా ప్రణాళిక సిద్ధం చేశామని, 70-80 శాతం ఉద్యోగులతో ఆఫీసులను నడిపించి తీరతామని చెబుతున్నారాయన. 

చదవండి: వర్క్‌ ఫ్రమ్‌ హోం చేసే వాళ్ల పరిస్థితి అంతేనా?(VIDEO)

మరిన్ని వార్తలు