ప్రపంచ బ్యాంక్ ముఖ్య ఆర్థికవేత్త
న్యూయార్క్ : కరోనా వైరస్ సృష్టించిన సంక్షోభం నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకునేందుకు ఐదేళ్ల సమయం పడుతుందని వరల్డ్ బ్యాంక్ ప్రధాన ఆర్థిక వేత్త కార్మెన్ రెన్హర్ట్ గురువారం పేర్కొన్నారు. లాక్డౌన్ నియంత్రణలను ఎత్తివేస్తే వేగంగా వృద్ధి చోటుచేసుకుంటుందని, అయితే పూర్తి స్ధాయిలో ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఐదేళ్లు పట్టవచ్చని మాడ్రిడ్లో జరిగిన ఓ వీడియో కాన్ఫరెన్స్లో రెన్హర్ట్ వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభంతో నెలకొన్న మాంద్యం కొన్ని దేశాల్లో అత్యధిక కాలం ఉంటుందని, రికవరీలో అసమానతలు ఉంటాయని అన్నారు. సంపన్న దేశాల కంటే పేద దేశాలు ఎక్కువగా దెబ్బతింటాయని ఆమె చెప్పుకొచ్చారు.
కరోనా సంక్షోభంతో గత ఇరవై సంవత్సరాల్లో తొలిసారిగా ప్రపంచవ్యాప్తంగా పేదరిక శాతం పెరిగిందని ఆమె వెల్లడించారు. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు మూడు కోట్లకు చేరువవగా, వ్యాధి బారినపడి 2.3 కోట్ల మంది కోలుకున్నారు. మహమ్మారి సోకి మరణించిన వారి సంఖ్య 9.45 లక్షలకు పెరిగింది. మరోవైపు మహమ్మారి నిరోధానికి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో అభివృద్ధి చేస్తున్న కోవిడ్-19 వ్యాక్సిన్లు వివిధ దశల్లో ఉన్నాయి. వచ్చే ఏడాది ఆరంభంలో వివిధ వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. చదవండి : కోవిడ్-19 వ్యాక్సిన్పై కీలక ప్రకటన