ప్రపంచంలోనే పవర్ ఫుల్ ఆయిల్ రిగ్‌లు ఏపీ ఓఎన్‌జీసీకి సరఫరా..!

8 Mar, 2022 19:27 IST|Sakshi

నిర్మాణరంగ దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ సంస్థ స్వదేశీ పరిజ్ఞానంతో ఆయిల్ రిగ్‌లను తయారు చేసి రికార్డ్‌ సృష్టించింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన రిగ్‌లను విజయవంతంగా డ్రిల్లింగ్ కార్యకలాపాలకు వినియోగిస్తుంది. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్(ఓఎన్‌జీసీ) నుంచి రూ.6000 కోట్ల విలువైన 47 ఆయిల్ రిగ్ ఆర్డర్ పొందిన మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని భీమవరంలోని ఓఎన్‌జీసీకి మరో రిగ్‌ను అందజేసింది. ఇది అత్యాధునిక స్వదేశీ ఆయిల్ రిగ్. 2,000 హెచ్‌పీ సామర్ధ్యం గల రిగ్ 3,000 హెచ్‌పీ సామర్ధ్యం గల సంప్రదాయ రిగ్‌లకు సమానమైన పనితీరును కనబరుస్తుంది. 

ఇది 6,000 మీటర్ల(6 కి.మీ) లోతు వరకు భూమిలోకి డ్రిల్ చేయగలదు. "మేక్ ఇన్ ఇండియా" & "ఆత్మనీర్ భర్ భారత్" కార్యక్రమాల కింద స్వదేశీ టెక్నాలజీతో అత్యంత సమర్థవంతమైన ఆయిల్ డ్రిల్లింగ్ రిగ్‌లను తయారు చేస్తున్న తొలి దేశీయ ప్రైవేట్ కంపెనీ ఎంఈఐఎల్. చమురు నిక్షేపాలను వెలికి తీసేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ రిగ్‌లు అత్యంత వేగంతో భూ పొరలను సులభంగా తవ్వుతుంది. వీటిని పూర్తిగా ఆటోమేటేడ్ టెక్నాలజీతో రూపొందించారు. సమీప భవిష్యత్తులో మనదేశంలో చమురు, సహజవాయువు రంగాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలనేది తమ లక్ష్యమని డ్రిల్‌మెక్‌ ఛైర్మన్‌ బొమ్మారెడ్డి శ్రీనివాస్‌ వివరించారు. 

అస్సాం (సిబ్సాగర్, జోరహత్), ఆంధ్రప్రదేశ్ (రాజమండ్రి), గుజరాత్ (అహ్మదాబాద్, అంకాలేశ్వర్, మెహసనా మరియు క్యాంబే), త్రిపుర (అగర్తలా), తమిళనాడు (కరైకల్) లోని ఓఎన్‌జీసీ ఆయిల్ డ్రిల్లింగ్ క్షేత్రాలకు ఎంఈఐఎల్ అన్ని  రిగ్‌లను తయారు చేసి సరఫరా చేస్తుంది. మేఘా గ్రూప్‌ ఆధ్వర్యంలో తొలిసారిగా దేశీయంగా వీటిని ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం కాకినాడ, హైదరాబాద్‌లలోని కేంద్రాల్లో రిగ్‌లను డ్రిల్‌మెక్‌ ఉత్పత్తి చేస్తోంది. చమరు ధరలు ఆకాశాన్ని తాకుతున్న సమయంలో వీటి అవసరం ఎంతగానే ఉంటుంది.

(చదవండి: కొత్త ఇల్లు కొనేవారికి షాక్.. ఏప్రిల్ 1 తర్వాత రూ.1.5 లక్షల రాయితీ రానట్లే!)

మరిన్ని వార్తలు