Xiaomi 1st EV Launch Date: మార్కెట్లోకి షియోమీ ఎలక్ట్రిక్‌ వాహనాలు వచ్చేది అప్పుడే..?

25 Nov, 2021 14:54 IST|Sakshi

ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ  షియోమీ తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాన్ని 2024 మొదటి అర్ధభాగంలో లాంఛ్ చేయనున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో ఈవీ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. అలాగే, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన కొన్ని వివరాలను షేర్ చేసింది. షియోమీ ఎలక్ట్రిక్ వాహనల పరిశోధన & అభివృద్ది కోసం మొత్తం 13,919 మంది సభ్యులు విభాగంలో పనిచేస్తున్నారని, వీరిలో 500 మంది కంపెనీ ఎలక్ట్రిక్ కారు ప్రాజెక్టులో పనిచేస్తున్నారని కంపెనీ వెల్లడించింది. ఆర్ అండ్ డి విభాగంలో దాదాపు 14000 మంది సభ్యులు ఉన్నారని, కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్యలో వీరి శాతం 44 అని ఒక ఆర్థిక నివేదికలో పేర్కొంది. 

ఆగస్టు 2021లో డీప్ మోషన్ అనే ఒక స్టార్టప్ కొనుగోలు చేసింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లీ జున్ మాట్లాడుతూ.. 2024లో భారీ సంఖ్యలో ఎలక్ట్రిక్‌ కార్లను షియోమీ ఉత్పత్తి చేయనున్నట్లు పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో వచ్చే పదేళ్లలో సుమారు 10 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టనుందని తెలిపారు. షియోమీ మొదటి ఎలక్ట్రిక్ కారు 2023 మొదటి అర్ధభాగంలో తయారు చేయడం ప్రారంభించి, 2024 మొదటి అర్ధభాగంలో మార్కెట్లోకి తీసుకొని రావచ్చు అని ప్రకటించారు. అయితే ఇది ప్రస్తుత ప్రణాళిక అని ఆయన పేర్కొన్నారు. షియోమీ ఇప్పటికే తన ఈవీ కంపెనీ షియోమీ ఈవీని 10 బిలియన్ యువాన్ల(రూ.11,000 కోట్ల) మూలధనంతో ప్రారంభించింది. షియోమీ మొదటి ఈవీ మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు ఇతర కంపెనీలైన యాపిల్, ఒప్పో, వివో, వన్ ప్లస్ ఎలక్ట్రిక్ కార్లతో పోటీ పడనుంది.

(చదవండి: పాత కార్లను ఎలక్ట్రిక్ కార్లుగా మారిస్తే ఎంత ఖర్చవుతుందో తెలుసా?)

మరిన్ని వార్తలు