-

Indian Smartphone Market: దుమ్ము లేపుతుంది, భారత్‌లో ఎక్కువగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ ఫోన్‌ ఇదే..!

29 Oct, 2021 17:13 IST|Sakshi

మనదేశంలో స్మార్ట్‌ ఫోన్‌ మూడో త్రైమాసిక (జులై,ఆగస్ట్‌, సెప్టెంబర్‌) ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రముఖ ప్రముఖ చైనా స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం షావోమీ ఫలితాలు కేక పెట్టించాయి.యాపిల్‌ సంస్థ ఐఫోన్ 13 సిరీస్‌ను మార్కెట్‌లో విడుదల చేసినా షావోమీని అధిగమించలేకపోయింది. కానీ ఈ త్రైమాసికంలో యాపిల్ వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్‌గా పేరు సంపాదించుకుంది.

కౌంటర్‌ పాయింట్ రిపోర్ట్‌ ఏమంటోంది..
కౌంటర్‌ పాయింట్ రిపోర్ట్‌ ప్రకారం.. మూడవ త్రైమాసికంలో మొత్తం భారతీయ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు 52 మిలియన్ యూనిట్లను దాటాయి. అయితే ఈ ఫలితాల్లో రెడ్‌మీ 9, రెడ్‌మీ 10 సిరీస్ స్మార్ట్‌ ఫోన్‌ల అమ్మకాలతో 22 శాతం వాటాతో షావోమీ ఇండియన్‌ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ షిప్‌మెంట్‌లో అగ్రస్థానంలో నిలిచింది. 19శాతం షిప్‌మెంట్‌తో శాంసంగ్‌ భారత్‌లో రెండవ అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా నిలిచింది. ఇక ఈ నివేదిక ప్రకారం నార్డ్‌ సిరీస్‌ 3 మిలియన్ యూనిట్లు భారత్‌లో డెలివరీ అయినట్లు తేలింది. 

ఈ ఏడాది ఎక్కువగా అమ్ముడైన ఫోన్‌ 
క్యూ3 భారతీయ స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లపై కౌంటర్‌పాయింట్ నివేదికలో షావోమీ, శాంసంగ్‌, వివో, రియల్‌మీ, ఒప్పో ఫోన్‌ల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. షావోమీ 22శాతం మార్కెట్‌ వాటాను కలిగి ఉండగా..షావోమీ నుండి విడుదలైన నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు రెడ్‌మీ9, రెడ్‌మీ9 పవర్‌, రెడ్‌మీ నోట్‌ 10, రెడ్‌మీ 9 అత్యధికంగా అమ్ముడైన జాబితాలో మొదటి నాలుగు స్థానాల్ని దక్కించుకున్నాయి. ఈ నాలుగు ఫోన్‌లు మూడవ త్రైమాసికంలో మిలియన్ కంటే ఎక్కువగా అమ్ముడైన ఫోన్‌ల జాబితాలో చోటు సంపాదించాయి. ఈ ఏడాదిలో రెడ్‌మీ 9 ఇప్పటి వరకు అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా అగ్రస్థానంలో ఉంది.

కొత్తగా విడుదలై.. ఆకట్టుకుంటున్న ఫోన్‌లు ఇవే
భారతదేశంలో 19 శాతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్ వాటాతో శాంసంగ్ రెండవ స్థానంలో ఉంది. రూ.10,000 నుంచి రూ.30,000 మధ్యలో ఉన్న ఫోన్‌ అమ్మకాల మార్కెట్‌ వాటా 25 శాతంగా ఉన్నట్లు వెల్లడించింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎం42, శాంసంగ్‌ గెలాక్సీ ఎం 52, శాంసంగ్‌ గెలాక్సీ ఏ 22, శాంసంగ్‌ గెలాక్సీ ఏ52ఎస్‌ మోడళ్లు 5జీ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌ బ్రాండ్‌లు రెండో స్థానాన్ని ఆక్రమించాయి. కొత్తగా విడుదలైన శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫోల్డ్‌3, శాంసంగ్‌ గెలాక్సీ జెడ్‌ ఫ్లిప్‌ 3 ఫోన్‌లో భారత స్మార్ట్‌ ఫోన్‌ యూజర్లను విపరీతంగా ఆకట్టుకుంటున్నట్లు తేలింది.
   
క్యూ3లో వివో షేర్‌ ఎంతంటే 
క్యూ3 2021లో 15 శాతం మార్కెట్ షేర్‌తో వివో 3వ స్థానంలో నిలిచింది. రియల్‌మీ 14 శాతం మార్కెట్ వాటా, ఒప్పో10 శాతం మార్కెట్‌ వాటాతో ఐదవ స్థానంలో నిలిచాయి. ఆపిల్ మూడవ త్రైమాసికంలో సంవత్సరానికి 212 శాతం వృద్ధితో వేగంగా అభివృద్ధి చెందుతున్న బ్రాండ్ అని కౌంటర్ పాయింట్ పేర్కొంది.  

క్యూ3 55 శాతం వృద్ధిని నమోదు చేయడంతో వన్‌ ప్లస్‌ నార్డ్‌ సిరీస్‌కు భారతదేశంలో మంచి ఆదరణ లభించిందని కౌంటర్ పాయింట్ పేర్కొంది. కొత్తగా ప్రారంభించిన వన్‌ ప్లస్‌ నార్డ్‌2,  నార్డ్‌ సీఈ 5జీలు వన్‌ ప్లస్‌ మార్కెట్‌లో రాణించడానికి కారణమైనట్లు వెల్లడించింది. క్యూ3 లో మొదటిసారిగా 5G స్మార్ట్‌ఫోన్ షిప్‌మెంట్‌లు 10 మిలియన్ల మార్కును అధిగమించాయని నివేదికలో చెప్పింది. వివో 5జీలో టాప్‌  స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా చెప్పబడింది. శామ్‌సంగ్, వన్‌ప్లస్, రియల్‌మీ 5జీ ఫోన్‌లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

చదవండి: మరికొన్ని గంటలే: షావోమి అదిరిపోయే ఆఫర్‌..సగానికి సగం ధరకే ఫోన్లు

మరిన్ని వార్తలు