Xiaomi:యాపిల్‌ను వెనక్కి నెట్టిన షియోమీ, అలా కలిసొచ్చిందా?

16 Jul, 2021 11:32 IST|Sakshi

స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో షియోమీ సంచలనం సృష్టించిది. యాపిల్‌ కంపెనీని వెనక్కి నెట్టేసి ప్రపంచంలో రెండో అతిపెద్ద ఫోన్‌ మేకర్‌గా నిలిచింది. ఇక ఈ చైనీస్‌ మొబైల్‌ కంపెనీ ఇప్పుడు శాంసంగ్‌ టాప్‌ పొజిషన్‌కు ఎర్త్‌ పెట్టేందుకు సిద్ధమైంది. 

టెక్నాలజీ మార్కెట్‌ అనలిస్ట్‌ canalys నివేదిక ప్రకారం.. 2021 రెండో క్వార్టర్‌లో ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల ద్వారా షియోమీ రెండో స్థానానికి చేరుకుంది. ఇక మొత్తం స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో 19 శాతం షేర్‌లతో దక్షిణ కొరియా దిగ్గజ కంపెనీ శాంసంగ్‌ టాప్‌ పొజిషన్‌లో ఉండగా, షియోమీ 17 శాతం షేర్ల వద్ద ముగిసింది. సాధారణంగా ఇప్పటిదాకా శాంసంగ్‌, యాపిల్‌ల్లో మాత్రమే ఏదో ఒకటి నెంబర్‌ వన్‌ పొజిషన్‌లో ఉంటూ వచ్చేవి. ఫస్ట్‌ టైం షియోమీ రెండో ప్లేస్‌కు చేరి ఆ సంప్రదాయానికి పుల్‌స్టాప్‌ పెట్టింది. 

హువాయ్‌ పతనం తర్వాత మిగతా ఫోన్‌ కంపెనీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. అయితే ఈ గ్యాప్‌ను పూరించే పోటీలో షియోమీ పైచేయి సాధించింది. లాటిన్‌ దేశాలకు 300 శాతం కంటే ఎక్కువ, ఆఫ్రికా దేశాలకు 150 శాతం, పశ్చిమ యూరప్‌ దేశాలకు 50 శాతం షియోమీ ఫోన్‌ ఎగుమతులు వెళ్లాయి. ఎంఐ11 అల్ట్రా లాంటి ఫోన్ల వల్లే షియోమీ క్రేజ్‌ పెరిగిందని.. అదే టైంలో ఒప్పో, వివో నుంచి గట్టి పోటీ ఎదురైందని కనాలిస్‌ నివేదిక వెల్లడించింది. అయినప్పటికీ షియోమీ రెండో స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక ఈ ఊపు ఇలాగే కొనసాగితే షియోమీ నెంబర్‌ వన్‌ బ్రాండ్‌గా అవతరించేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడింది. ప్రస్తుతం యాపిల్‌కు 14 శాతం షేర్‌ ఉండగా, ఒ‍ప్పో.. వివోలు చెరో పదిశాతం మార్కెట్‌ను కలిగి ఉన్నాయి.

మరిన్ని వార్తలు