Yes Bank: యస్‌ బ్యాంక్‌ నష్టం 3,790 కోట్లు

1 May, 2021 04:51 IST|Sakshi

 మొండిబాకీలకు పెరిగిన ప్రొవిజనింగ్‌

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ప్రైవేట్‌ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం యస్‌ బ్యాంక్‌ ఏకంగా రూ. 3,790 కోట్ల నికర నష్టం (కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన) ప్రకటించింది. ఆదాయం క్షీణించడం, మొండిబాకీలకు ప్రొవిజనింగ్‌ భారీగా పెరగడమే ఇందుకు కారణం. గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో లాభం రూ. 2,665 కోట్లు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి గాను యస్‌ బ్యాంక్‌ నికర నష్టాలు రూ. 16,432 కోట్ల నుంచి రూ. 3,488 కోట్లకు తగ్గాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పునర్‌వ్యవస్థీకరించే అవకాశమున్న రుణాల కోసం కూడా ముందుగా ప్రొవిజనింగ్‌ చేసినట్లు యస్‌ బ్యాంక్‌ ఎండీ ప్రశాంత్‌ కుమార్‌ తెలిపారు. మార్చి త్రైమాసికంలో మొండిబాకీలకు ప్రొవిజనింగ్‌ రూ. 5,239 కోట్లకు పెరిగినట్లు పేర్కొన్నారు. అంతక్రితం క్యూ4లో ఇది రూ. 4,872 కోట్లుగా ఉంది.  

మరో రూ.5,000 కోట్ల రికవరీ లక్ష్యం..: అసెట్‌ క్వాలిటీపరమైన సమస్యలు ఇక ముగిసినట్లేనని, ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కనీసం రూ. 5,000 కోట్లు రికవరీ చేయాలని నిర్దేశించుకున్నట్లు కుమార్‌ వివరించారు. మొత్తం రుణాల పోర్ట్‌ఫోలియోను 15% పెంచుకోవాలని, రిటైల్‌ రుణాలను 20% పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం యస్‌ బ్యాంక్‌ పోర్ట్‌ఫోలియోలో రిటైల్, చిన్న రుణాల వాటా 51% దాకా ఉంది. క్రమంగా మళ్లీ కార్పొరేట్‌ రుణాలను ఇవ్వనున్నట్లు, ఈ విభాగంలో 10% వృద్ధి అంచనా వేస్తున్నట్లు కుమార్‌ తెలిపారు. మార్చి క్వార్టర్‌లో రూ. 3,500 కోట్ల కొత్త రుణాలిచ్చినట్లు పేర్కొన్నారు. అటు స్థూల నిరర్థక ఆస్తుల పరిమాణం 16.80% నుంచి 15.41%కి తగ్గాయి. జూన్‌ క్వార్టర్‌లో రూ. 2,500 కోట్ల  రుణాలను పునర్‌వ్యవస్థీకరించాల్సి రావచ్చని అంచనా వేస్తున్నట్లు.. వీటిలో సింహభాగం కార్పొరేట్‌ విభాగానివే ఉండొచ్చని కుమార్‌ తెలిపారు.
 

>
మరిన్ని వార్తలు