ఆగని యస్‌బ్యాంక్‌ పతనం

28 Jul, 2020 15:42 IST|Sakshi

రూ.12 కిందకు చేరుకున్న షేరు

యస్‌బ్యాంక్‌లో తగ్గిన ఎస్‌బీఐ వాటా

యస్‌బ్యాంక్‌ షేరు పతనం ఆగట్లేదు. గత కొన్నిరోజుల వరుస పతనాన్ని కొనసాగిస్తూ మంగళవారం మరో 3శాతం నష్టపోయింది. ఈ క్రమంలో ఇటీవల బ్యాంక్‌ జారీ చేసిన ఫాలో ఆన్‌ పబ్లిక్‌(ఎఫ్‌ఓపీ)ఆఫర్‌ ఇష్యూ ధర రూ.12 కంటే దిగువకు చేరుకుంది. బీఎస్‌ఈలో ఈ కంపెనీ షేరు 9.75శాతం నష్టంతో రూ.11.10 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఇంట్రాడేలో స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించడంతో షేరు మార్కెట్‌ ముగిసే సరికి రూ.3.25శాతం నష్టంతో రూ.11.95వద్ద స్థిరపడింది. యస్‌బ్యాంక్‌ షేరు వారం రోజుల్లో 41శాతం, నెలలో 57శాతం, ఏడాదిలో 75శాతం నష్టాన్ని చవిచూశాయి.

యస్‌బ్యాంక్‌లో తగ్గిన ఎస్‌బీఐ వాటా
యస్‌బ్యాంక్‌ ఎఫ్‌పీఓ ఇష్యూ తర్వాత బ్యాంక్‌లో తమ వాటా తగ్గినట్లు ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. యస్‌ బ్యాంక్‌ ఫాలోఆన్‌పబ్లిక్‌ ఆఫర్‌ ఇష్యూ ఈ జూలై 17న ముగిసింది. ఈ ఇష్యూ ద్వారా బ్యాంక్‌ మొత్తం రూ.15వేల కోట్లను సమీకరించింది. ఈ  ఇష్యూలో జారీ చేయబడిన షేరు ఈ సోమవారం నుంచి ట్రేడ్‌ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో యస్‌బ్యాంక్‌లో ఎస్‌బీఐ వాటా మొత్తం వాటా 48.21శాతం నుంచి 30శాతానికి పరిమితమైంది.

మరిన్ని వార్తలు