సోషల్ మీడియాలో ఇలాంటివి పోస్ట్ చేయకండి

28 Nov, 2020 16:05 IST|Sakshi

ప్రస్తుతం ప్రపంచ జనాభాలో సగానికి పైగా ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఉపయోగిస్తున్నారు. అందుకే ఈ సోషల్ మీడియా యుగంలో.. సంతోషమైనా.. విచారమైనా.. విడాకులైనా.. పుట్టుకైనా.. చావైనా.. ఇట్టే ప్రపంచానికి తెలిసిపోవాల్సిందే. చాలా మంది సోషల్ మీడియాలో వారు పెట్టిన పోస్టులకు ఎన్ని లైకులు, కామెంట్లు వచ్చాయి అనే దానిపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. సోషల్ మీడియా ద్వారా మనకు ఎంత మంచి జరుగుతుందో.. అంత కన్నా ఎక్కువే చెడు జరుగుతుంది. సోషల్ మీడియాలో మంచి వార్తల కన్నా నకిలీ వార్తలు ఎక్కువగా ప్రభావం చూపుతున్నాయి. ఇలువంటి పోస్టుల ద్వారా మనకు తెలియకుండానే మనం పెద్ద ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువ. ఏదైనా మితంగా వాడితే మంచిది.. లేకపోతె అనేక అనర్దాలకు దారి తీస్తుంది. అందుకే మీరు సోషల్ మీడియా ద్వారా ప్రమాదంలో పడకుండా ఉండటానికి కొన్ని విషయాల గురించి మీకు తెలియజేస్తాము. (చదవండి: ఐఫోన్ 12 సిరీస్ తయారీ ఖర్చు ఎంత?)

ఇంతకుముందు సోషల్ మీడియాలో వచ్చే పోస్టుల గురించి పెద్దగా పట్టించుకోని ఆయా సంస్థలు.. తాజాగా ఇలా చేసేవారిమీద ఓ కన్నేసి ఉంచుతున్నాయి. అందుకు తగ్గట్టుగా వారి పాలసీలను మార్చుకుంటున్నాయి. ఫేక్ న్యూస్‌ను అరికట్టేందుకు సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్ వంటివి ప్రత్యేక నిఘా టీంలను ఏర్పాటు చేసుకున్నాయి. ఎవరెవరు ఏం పోస్టులు చేస్తున్నారు..? అందులో నిజమెంత..? వంటివన్నీ ఈ బృందాలు పరిశీలిస్తాయి. తరుచూ ఫేక్ న్యూస్ పోస్ట్ చేసేవారి ఖాతాలను బ్లాక్ చేయడం.. వారు ఇంకా అలాగే చేస్తుంటే పోలీసులకు ఫిర్యాదు చేయడం కూడా చేస్తున్నాయి.

మీరు ఎప్పటికి కరోనా వైరస్‌కు సంబంధించిన నకిలీ వీడియోలను సోషల్‌ మీడియాలో షేర్ చేయవద్దు. ఇవి ఆయా సామాజిక మాధ్యమ సంస్థల విధానాలకు వ్యతిరేకంగా ఉంటే అవి మీ పై కేసు పెట్టవచ్చు. అలాగే ఇతరులు ఫార్వార్డ్ చేసిన నకిలీ సందేశాలను ఫేస్‌బుక్, ట్విటర్, వాట్సప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేయవద్దు. ఇవి కూడా మిమ్మల్ని ఇబ్బందుల్లో పడేయొచ్చు. దీని ద్వారా పోలీసులు అదుపులోకి తీసుకోవచ్చు. మీరు పని చేసే సంస్థ యొక్క ఫోటోలను కూడా పోస్ట్ చేయవద్దు. ఇలా చేసిన వారికి నోటీసులు జారీ చేస్తున్నాయి. సంస్థకు సంబంధించిన విషయాలు గానీ.. ఫోటోలు గానీ పోస్టు చేయడాన్ని ఆ సంస్థలు సీరియస్‌గా తీసుకుంటున్నాయి. ఎన్నికలప్పుడు గాని, ఇతర సమావేశాలు నిర్వహించేటప్పుడు రెచ్చగొట్టే పోస్టులు, హింసాత్మక పోస్టులను సోషల్ మీడియాలో పోస్టు చేస్తే అంతే. అలాంటి పోస్టులకు భారీ మూల్యం చెల్లించాల్సిందే. సోషల్ మీడియా సంస్థలే గాక.. పోలీసులు, నిఘా విభాగం, సైబర్ పోలీసులు వీటి మీద నిఘా వేసి ఉంచుతారు.

మరిన్ని వార్తలు