యూట్యూబ్‌లో వారికే మొదటి ప్రాధాన్యత: సీఈవో నీల్‌మోహన్‌

2 Mar, 2023 21:44 IST|Sakshi

కంటెంట్‌ క్రియేటర్లు, ఆర్టిస్టులు యూట్యూబ్‌కు గుండె కాయ లాంటి వారని, వారికే తాను మొదటి ప్రధాన్యత ఇస్తానని యూట్యూబ్ సీఈవో నీల్ మోహన్ స్పష్టం చేశారు.  గత నెలలో సీఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా ఆయన యూట్యూబ్‌ కమ్యూనిటీతో తన భావాలను పంచుకున్నారు.  ప్రధాన్యతలు తెలియజేశారు.  

ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇప్పుడిప్పుడే తన సామర్థ్యాలను చాటుతోందని, వీడియోల స్వరూపాన్నే మార్చేసి అసాధ్యాన్ని సుసాధ్యం చేసే రోజులు ముందున్నాయని పేర్కొన్నారు.  రాబోయే రోజుల్లో ఈ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి యూట్యూబ్‌ కంటెంట్‌ క్రియేటర్లు కూడా ప్రయోజనం పొందుతారన్నారు.

యూట్యూబ్‌ సరికొత్త ఏఐ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌) ఫీచర్‌లను తమ వీడియో షేరింగ్‌ ప్లాట్‌ఫామ్‌లో ప్రవేశపెట్టనుంది. దీంతో కంటెంట్ క్రియేటర్లు తమ వీడియోలకు అద్భుతమైన హంగులు జోడించేందుకు వీలు కలుగుతుంది. ఏఐ ఉత్పత్తుల్లో ఇ‍ప్పటికే ముందున్న ఓపెన్‌ఏఐ, మైక్రోసాఫ్ట్‌ సంస్థలకు గట్టి పోటీ ఇచ్చే లక్ష్యంతో గూగుల్‌ ఈ ప్రయత్నం చేస్తోంది. 

చదవండి: త్వరలోనే మోటరోలా కొత్త వర్షన్‌ మడత ఫోన్లు.. ప్రకటించిన సీఈవో

సరికొత్త ఏఐ సాధనాలను విడుదల చేయాలనే ఆతృతలో ఉన్న ఆల్ఫాబెట్‌ యాజమాన్యంలోని గూగుల్‌.. ఇప్పటికే ఉన్న దాని సొంత సాధనాలు, సేవలను మెరుగుపరచడంలో నిదానంగా ఉందని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో పోటీదారులు ఓపెన్‌ ఏఐ చాట్‌జీపీటీని, మైక్రోసాఫ్ట్‌ బింగ్‌ ఏఐ చాట్‌బాట్‌ను విడుదల చేశాయి.

కంపెనీకి డిజిటల్‌ యాడ్‌లు తగ్గిపోవడం, చాట్‌బాట్‌ల కారణంగా కంపెనీ ప్రధాన ఆదాయమైన ఇంటర్‌నెట్‌ సెర్చ్‌ వ్యాపారం మందగించడం వంటి ఎదురుదెబ్బలతో గూగుల్‌ కూడా గత ఫిబ్రవరిలో బార్డ్ అనే ఏఐ చాట్‌బాట్‌ను ప్రకటించింది.  ఏది ఏమైనా ఏఐ విషయంలో గూగుల్‌ అప్రమత్తంగా ఉందనే విషయం యూట్యూబ్‌ సీఈవో నీల్‌ మోహన్ మాటల్లో వ్యక్తమౌతోంది.

చదవండి: WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్‌లో భారత్‌ టాప్‌!

మరిన్ని వార్తలు