సోనీటీవీలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ విలీనం !

22 Sep, 2021 11:53 IST|Sakshi

భారత మీడియా రంగంలో రెండు సంస్థల మధ్య భారీ ఒప్పందం కుదిరింది. సోనీ టీవీలో..జీ ఎంటర్‌ టైన్మెంట్‌ విలీనమైంది. కంటెంట్‌ క్రియేషన్‌లో గత మూడు దశాబ్దాలుగా వ్యూయర్స్‌ను ఆకట్టుకుంటున్న జీఎంటర్‌ టైన్మెంట్‌ పలు కీలక పరిణామల నేపథ్యంలో సోనీ టీవీలో విలీనం అయ్యేందుకు సిద్ధ పడింది. ఇందుకు జీ డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలపడంతో విలీనం ఖరారైంది. 

దీంతో విలీనం తర్వాత ఏర్పడే సంస్థలో జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు 47 శాతం, ఎస్‌పీఎన్‌ఐకు 52 శాతం వాటాలు దక్కనున్నాయి. ప్రస్తుతం జీ ఎంటర్‌ టైన్మెంట్‌ సీఈఓగా ఉన్న పునీత్‌ గోయెంకా విలీన సంస్థకు ఐదేళ్ల పాటు ఎండీ, సీఈఓగా వ్యవహరించనున్నారు.  

జీ లెర్న్, జీ మీడియాకూ సెగ! 
మరో వైపు జీ ఎంటర్‌టైన్‌మెంట్, డిష్‌ టీవీ తదుపరి జీ లెర్న్, జీ మీడియాలపై సుభాష్‌ చంద్ర కుటుంబానికి వాటాదారుల నుంచి అసమ్మతి సెగ తగలనున్నట్లు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.తొలుత డిష్‌ టీవీలో సవాళ్లు ఎదురుకాగా..గత వారం జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి ప్రమోటర్లతో పాటు,పునీత్‌ గోయెంకా అధ్యక్షతన ఏర్పాటైన మేనేజ్‌మెంట్‌ను తొలగించడంపై ఈజీఏం ఏర్పాటుకు డిమాండ్లు వెలువడిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో జీ లెర్న్, జీ మీడియా నుంచి సైతం సుభాష్‌ చంద్రకు చెందిన ప్రమోటర్‌ ఎస్సెల్‌ గ్రూప్‌నకు వ్యతిరేకంగా వాటాదారులు గళమెత్తే అవకాశమున్నట్లు మార్కెట్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈజీఎం ఏర్పాటుకు వాటాదారులు పట్టుబట్టే అవకాశమున్నట్లు అభిప్రాయపడ్డాయి. అయితే జీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో సుభాష్‌ చంద్ర వాటా 3.99 శాతమేకాగా.. జూన్‌కల్లా జీ లెర్న్‌లో 21.69 శాతం, జీ మీడియా కార్పొరేషన్‌లో 14.72 శాతం చొప్పున ప్రమోటర్లు వాటాను కలిగి ఉన్నారు. 

మరిన్ని వార్తలు