బాంబే హైకోర్టుకి చేరిన జీ టీవీ వివాదం

2 Oct, 2021 19:44 IST|Sakshi

జీ టీవీ యాజమాన్యానికి దానిలో పెట్టుబడిదారులకు మధ్య చెలరేగిన వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. వివాదం పరిష్కరించుకునేందుకు ఇరు వర్గాలు సుముఖంగా లేవు. దీంతో రెండు వైపులా వేర్వేరుగా న్యాయస్థానాలను ఆశ్రయించారు. 

బాంబై హైకోర్టులో
అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించాలంటూ ఇన్వెస్కో, ఓఎఫ్‌ఐ గ్లోబల్‌ చైనా ఫండ్‌లు పంపిన నోటీసులు చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ జీ టీవీ యాజమాన్యం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. అంతకు ముందే అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించలేమంటూ ఇన్వెస్కో , ఓఎఫ్‌ఐలకు జీ టీవీ తెలియజేసింది.

ముదిరిన వివాదం
జీ టీవీలో ఇన్వెస్కోతో పాటు ఓఎఫ్‌ఐ గ్లోబల్‌ చైనా ఫండ్‌ సంస్థలు భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ రెండు సంస్థలు దాదాపు 18 శాతం వాటాతో జీ టీవీలో మేజర్‌ షేర్‌హోల్డర్లుగా ఉన్నాయి. సెప్టెంబరు 4న జీ టీవీ సీఈవోగా పునీత్‌ గోయెంకాను తొలగించాలంటూ మేజర్‌ షేర్‌ హోల్డర్లు జీ మేనేజ్‌మెంట్‌ని కోరారు. దీనిపై చర్చలు జరుగుతుండగానే షేర్‌ హోల్డర్లను సంప్రదించకుండా సోనీ టీవీలో జీ టీవీని విలీనం చేశారు. ఈ రెండు సంస్థలకు సంయుక్తంగా సీఈవోగా పునీత్‌ గోయెంకాను నియమించారు. 

వెనక్కి తగ్గట్లేదు
మేజర్‌ షేర్‌ హోల్డర్ల నిర్ణయాలను పక్కన పెట్టి విలీనం చేయడమే కాకుండా తాము కోరినట్టుగా సీఈవో మార్పు చేయకపోవడంతో అత్యవరసర బోర్డు సమావేశం నిర్వహించాలంటూ మరోసారి ఇన్వెస్కో జీని కోరింది. అయితే జీ ఈ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

అక్టోబరు 4న విచారణ
జీ యాజమాన్య మొండి వైఖరిని నిరసిస్తూ ఇన్వెస్కో సంస్థ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ని ఆశ్రయించింది. వెనువెంటనే అత్యవసర బోర్డు సమావేశం నిర్వహించేలా జీ మేనేజ్‌మెంట్‌కు ఆదేశాలు ఇవ్వాలని కోరింది. అక్టోబరు 4న దీనిపై విచారణ జరగనుంది. దీంతో అక్టోబరు 2నే జీ యాజమాన్యం బాంబే హై కోర్టును ఆశ్రయించింది. 

చదవండి : ‘జీ’ కప్పులో చల్లారని తుఫాను.. కొత్త చిక్కుల్లో సోని

మరిన్ని వార్తలు