కొత్త పన్ను విధానం ఏప్రిల్‌ 1 నుంచి... వీరికి ఒక్క రూపాయి కూడా ప​న్ను లేదు!

16 Mar, 2023 16:17 IST|Sakshi

ఆదాయపు పన్నుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పన్ను విధానం 2023-24 ఆర్థిక సంవత్సరం నుంచి అంటే వచ్చే ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వస్తోంది. కొత్త ఆదాయపు పన్ను విధానంలో జీతం పొందే ఉద్యోగులు, పెన్షనర్లు రూ. 7.5 లక్షల వరకూ వార్షిక ఆదాయంపై ఒక్క రూపాయి కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.

ఇదీ చదవండి: ఈ పథకంతో సీనియర్‌ సిటిజన్స్‌కు రూ.20 వేల వరకు రాబడి! 

2023 బడ్జెట్ ఏమి చెబుతోంది?
ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం రూ. 7 లక్షలకు మించకుంటే అలాంటివారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని 2023 బడ్జెట్లో ప్రభుత్వం  ప్రకటించింది. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 87ఏ కింద లభించే గరిష్ట రాయితీ పరిమితిని 2023 బడ్జెట్‌లో రూ.12,500 నుంచి రూ.25,000కి పెంచింది. (ఇక ఎయిర్‌ప్యాడ్స్‌ కూడా తక్కువ ధరకే: రూ. 1,654 కోట్లతో ఫాక్స్‌కాన్‌ ఫ్యాక్టరీ!)

సెక్షన్ 87ఏ కింద రాయితీ ఎవరికి వర్తిస్తుంది?
ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. సెక్షన్ 87ఏ కింద రాయితీ కేవలం భారత్‌లో నివాసం ఉంటున్న వారికి మాత్రమే. ప్రవాసభారతీయులు (ఎన్నారైలు), హిందూ అవిభక్త కుటుంబాలు, సంస్థలు వంటి ఈ రాయితీకి అనర్హులు.

స్టాండర్డ్ డిడక్షన్
జీతం అందుకునే ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం 2023 కొత్త బడ్జెట్‌లో రూ. 50,000 స్టాండర్డ్ డిడక్షన్‌ను పొడిగించింది. ఇంతకు ముందు స్టాండర్డ్ డిడక్షన్ పాత ఆదాయపు పన్ను విధానంలో మాత్రమే అందుబాటులో ఉండేది.

రూ. 7.5 లక్షల వరకూ పన్ను లేదు
2023 బడ్జెట్‌లో ప్రకటించిన తగ్గింపు, రాయితీ, ఆదాయపు పన్ను స్లాబ్‌లలో మార్పుల ఫలితంగా  ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ పింఛన్‌దారులు వార్షిక ఆదాయం రూ. 7.5 లక్షల వరకూ ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.

ప్రాథమిక మినహాయింపుపై గందరగోళం వద్దు 
2023 బడ్జెట్ ప్రకారం ప్రాథమిక పన్ను మినహాయింపు పరిమితిని ప్రభుత్వం రూ.2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచింది. మరి రూ.7.5 లక్షల వరకు పన్ను లేదని ఎలా చెబుతున్నారని గందరగోళానికి గురికావద్దు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఆదాయం రూ. 3 లక్షలు దాటితే పన్ను విధిస్తారు. అయితే రూ.7.5 లక్షల వరకు ఆదాయం ఉన్నా కూడా కొత్త పన్ను విధానంలో రిబేట్, తగ్గింపులను క్లెయిమ్ చేసుకోవడం వల్ల ఎలాంటి పన్నూ చెల్లించాల్సిన అవసరం లేదు.

మరిన్ని వార్తలు