నా కొత్త ఫోన్‌ పోయింది మీరు చూశారా.. విరాట్‌ కోహ్లీ ట్వీట్‌ వైరల్‌!

7 Feb, 2023 16:22 IST|Sakshi

ఫిబ్రవరి 9 నుంచి స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో అదరగొట్టేందుకు టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి సిద్దమవుతున్నాడు. ఈ తరుణంలో విరాట్‌ కోహ్లీ చేసిన ఓ ట్వీట్‌ వైరల్‌గా మారింది. అయితే ఆ ట్వీట్‌ బిజినెస్‌ ప్రమోషన్‌లో భాగమేనని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తుండగా.. ఎండార్స్ మెంట్లతోనే కాదు ట్వీట్‌ల రూపంలో కోట్లు కొల్లగొడుతున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఏ విషయంపై విరాట్‌ కోహ్లీ ట్వీట్‌ చేశారని అనుకుంటున్నారా? 

విరాట్‌ కోహ్లీ ఓ కొత్త ఫోన్‌ కొన్నాడట. ఆ ఫోన్‌ను పోగొట్టుకున్నాడట. ఇంకేముంది. అన్‌ బాక్సింగ్‌ చేయకుండా ఫోన్‌ పోగొట్టుకోవడంపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో కొన్న ఫోన్‌ ఎలా ఉందో చూడకుండా (అన్‌ బాక్సింగ్‌) పోగొట్టుకుంటే అంతకు మించిన బాధ మరొకటి ఉండదేమో...మీలో ఎవరైనా ఆ ఫోన్‌ను చూశారా..? అని విరాట్ కోహ్లీ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

అదే సమయంలో ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ ఫుడ్ డెలివరీ యాప్‌ జొమాటో మాత్రం విచిత్రంగా స్పందించింది. ‘వదిన ఫోన్ నుంచి ఐస్‌ క్రీమ్‌  ఆర్డర్‌ చేసేందుకు మొహమాటం పడొద్దు. ఇప్పుడు అదే మీకు సాయపడుతుంది’ అని జొమాటో కామెంట్ పెట్టింది. 

దీంతో కోహ్లీ ట్వీట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుండగా.. కొందరు అభిమానులు మాత్రం స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థల్ని ట్యాగ్‌ చేస్తూ వెంటనే కోహ్లీకి మీ కంపెనీ మొబైల్‌ పంపించండి’ అని సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు