చిన్న వ్యాపారుల కోసం సరికొత్త ఎలక్ట్రిక్ కార్గో టూ వీలర్

12 Jul, 2021 18:42 IST|Sakshi

ఎలక్ట్రిక్ స్టార్టప్ కంపెనీ జైప్ ఎలక్ట్రిక్ చిన్న వ్యాపారులు, డెలివరీ బాయ్స్ కోసం కొత్త ఎలక్ట్రిక్ కార్గో టూ వీలర్ ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఈ హెవీ డ్యూటీ స్కూటర్ 250 కిలోల లోడింగ్ సామర్థ్యంతో లాజిస్టిక్స్ కోసం తయారు చేసినట్లు కంపెనీ పేర్కొంది. దీనిని ఒకసారి చార్జ్ చేస్తే 120 కిలోమీటర్లు దూరం ప్రయాణించవచ్చు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 40 ఎహెచ్ బ్యాటరీ సామర్థ్యం గల పోర్టబుల్ ప్యాక్ తో వస్తుంది. దీనిని మొదటగా ఢిల్లీ-ఎన్ సీఆర్ ప్రాంతంలో  ప్రారంభించనున్నారు. క్రేట్లు, పెట్ బాటిల్స్, సీలిండర్లు, హెవీ లోడ్ షిప్ మెంట్, కిరాణా సామాగ్రి, పెద్ద ఫుడ్ బ్యాగులు, ఈ కామర్స్ బల్క్ షిప్ మెంట్ వంటి వాటిని దీని ద్వారా సులభంగా రవాణా చేయవచ్చు.

అందుకే ఈ కామర్స్, కిరాణా, బి2బి డెలివరీ కంపెనీలకు ఈవీ అత్యంత అనుకూలంగా ఉంటుందని స్టార్టప్ పేర్కొంది. ఈ స్కూటర్ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్, మెటల్ బాడీవర్క్ డిజైన్ కలిగి ఉంది. దీనిని బైక్ టాక్సీగా కూడా ఉపయోగించవచ్చు. వాహనాలు, బ్యాటరీలు, డ్రైవర్లను ట్రాక్ చేయడానికి ఇది ఐఓటి ఆధారిత ఫీచర్లతో వస్తుంది. "లాజిస్టిక్స్ విభాగంలో 3 సంవత్సరాలు పరిశోదన చేసిన తర్వాత డెలివరీ కోసం 250 కిలోల లోడింగ్ సామర్థ్యం గల కార్గో భారతదేశపు మొట్టమొదటి హెవీ డ్యూటీ ఎలక్ట్రిక్ 2 వీలర్ ప్రారంభించడం మాకు చాలా సంతోషంగా ఉంది" అని జైప్ ఎలక్ట్రిక్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆకాశ్ గుప్తా తెలిపారు.

>
మరిన్ని వార్తలు