సాక్షి, హైదరాబాద్ : నోయిడాలో ఉంటూ విమానంలో హైదరాబాద్ వచ్చి పట్టపగలు చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను బాలానగర్ ఎస్ఓటీ బృందం శుక్రవారం అరెస్ట్ చేసింది. సైబరాబాద్ సీపీ సజ్జనార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చత్తీస్ఘడ్, కుమారీ టౌన్ దుర్గ్ జిల్లాకు చెందిన గిరి గంగాధర్ అలియాస్ గొడుగు గంగాధర్ నోయిడాలోని సెక్టార్ 37లో ఉంటూ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడిన అతను చోరీలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. తరచూ మచ్చబొల్లారం వచ్చే అతడికి పరిసర ప్రాంతాల్లోని కాలనీలు సుపరిచితమే.(చదవండి : ‘నౌకరీ’లో రెజ్యూమ్లను తీసుకొని..)
నోయిడా నుంచి విమానాల్లో వచ్చి పగటి వేళల్లో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి చోరీ చేసేవాడు. అనంతరం విమానంలోనే నోయిడాకు ఉడాయించేవాడు. అల్వాల్ పీఎస్ పరిధిలో రెండు, కీసర పీఎస్ పరిధిలో రెండు చోరీలకు పాల్పడ్డాడు. దీనిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన బాలానగర్ ఎస్ఓటీ బృంధం నోయిడా వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుంది. అతడి నుంచి 40 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో బాలానగర్ డీసీపీ పద్మజ, ఎస్వోటీ అడిషనల్ డీసీపీ సందీప్, ఇన్స్పెక్టర్లు రమణా రెడ్డి, జేమ్స్ బాబు, ఎస్వోటీ బాలానగర్ బృంధం పాల్గొన్నారు.