పోలీసులే నివ్వెరపోయేలా క్యాడ్‌బరీ గోడౌన్‌లో భారీ దోపీడీ

17 Aug, 2022 10:58 IST|Sakshi

ట్రక్కులతో వచ్చి చాక్లెట్‌ డబ్బాలు దోపీడీ

రూ.17 లక్షల విలువైన చాక్లెట్లు చోరీ

లక్నో: యూపీ,లక్నోలోని చిన్‌హాట్ ప్రాంతంలో భారీ చోరి జరిగింది. ప్రముఖ బ్రాండ్‌ క్యాడ్‌బరీకి చెందిన దాదాపు 150 కార్టన్‌ల చాక్లెట్ బార్‌లను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకుపోయారు. అందరూ స్వాతంతత్ర్య దినోత్సవ సంబరాల్లో ఉంటే దొంగలు మాత్రం తమ పని తాము చేసుకు పోయారు.   ట్రక్కులతో వచ్చి మరీ ఈ  చోరీకి  పాల్పడ్డారు.  చోరీ అయిన చాక్లెట్ల విలువు 17 లక్షల రూపాయలని అంచనా వేశారు.

యూపీ రాజధాని పోలీసులంతా ఒకవైపు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వీవీఐపీల భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.ఇదే అదునుగా భావించిన దుండగులు ఈ చోరీకి తెగబడ్డారు. అంతే కాదు సాక్ష్యాలు లేకుండా,  అక్కడున్న సీసీ కెమెరా డిజిటల్ వీడియో రికార్డర్‌ను కూడా ఎత్తుకు పోవడంతో పోలీసులు సైతం హతాశులయ్యారు.

బ్రాండ్ పంపిణీదారు, వ్యాపారవేత్త రాజేంద్ర సింగ్ సిద్ధు ఈ చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.  రూ. 7 లక్షల విలువైన చాక్లెట్లున్న 150 డబ్బాలు, కొన్ని బిస్కెట్ల పెట్టెలు కూడా చోరీ అయ్యాయని సిద్ధు పోలీసులకు తెలిపారు. రెండ్రోజుల క్రితమే స్టాక్ వచ్చిందని, నగరంలోని చిల్లర వ్యాపారులకు వీటిని పంపిణీ చేయాల్సి ఉందని వాపోయారు. దీనిపై ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు చేరవేయాలని ఆయన విజ్ఞప్తి  చేశారు.

మరిన్ని వార్తలు