Zoom layoffs: అరగంటలో 1300 ఉద్యోగాలు ఊస్టింగ్‌.. భారీగా జీతం వదులుకున్న సీఈఓ!

8 Feb, 2023 09:35 IST|Sakshi

వీడియో కాన్ఫరెన్సింగ్ సేవలు అందించే సంస్థ జూమ్ కూడా లేఆఫ్స్ కంపెనీల జాబితాలో చేరింది. తమ వర్క్‌ఫోర్స్‌లో 15 శాతం లేదా 1300 మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ సీఈఓ ఎరిక్ యువాన్ మంగళవారం ఒక బ్లాగ్ పోస్ట్ చేశారు. తొలగిస్తున్న ఉద్యోగులకు 30 నిమిషాల్లో మెయిల్‌ ద్వారా సమాచారం అందిస్తామన్నారు. కరోనా సమయంలో ఇంటి దగ్గర నుంచి పనిచేసేవారు ఎక్కువైన నేపథ్యంలో డిమాండ్‌కు తగ్గట్లుగా ఎక్కువ మందిని నియమించుకోవాల్సి వచ్చిందని, ఇప్పుడు కొందరిని తొలగించక తప్పట్లేదని వివరణ ఇచ్చారు. డిమాండ్‌ను అందుకోవడానికి 24 నెలల వ్యవధిలో ఉద్యోగుల్ని మూడు రెట్లు ఎక్కువగా నియమించుకున్నట్లు వివరించారు.

ఇప్పట్లో అలా కొనసాగడం కష్టమని చెప్పిన ఎరిక్.. సంస్థ దీర్ఘకాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నారు. కష్టపడి పనిచేస్తున్న, ప్రతిభావంతులైన 1300 మంది ఉద్యోగులకు గుడ్‌బై.. అంటూ భావోద్వేగ పూరిత లేఖ రాశారు. ఉద్యోగం కోల్పోయిన వారందరికీ 30 నిమిషాల్లో మెయిల్స్ వస్తాయని, ఈ విధంగా సమాచారం అందిస్తున్నందుకు తనను క్షమించాలని కోరారు.

(ఇదీ చదవండి: విప్రో బాటలో ఇన్ఫీ: 600 మంది ఫ్రెషర్లు ఔట్‌!)

జీతంలో 98 శాతం కోత
మరోవైపు కంపెనీ ఖర్చును తగ్గించేందుకు సీఈఓ ఎరిక్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో తన వేతనంలో ఏకంగా 98 శాతం కోత విధించుకున్నట్లు సంచలన నిర్ణయం ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితికి జవాబుదారీగా తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, 2023లో కార్పొరేట్ బోనస్‌ను కూడా వదులుకుంటున్నానని వెల్లడించారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్‌ టీమ్ కూడా తమ కనీస వేతనాలను 20 శాతం మేర తగ్గించుకుంటున్నాయన్నారు. ఇక ఉద్యోగం కోల్పోయిన వారు యూఎస్‌లో ఉన్నట్లయితే వారికి 16 వారాల వేతనం, హెల్త్‌కేర్ కవరేజీ, యాన్యువల్ బోనస్ అందుతాయని తెలిపారు.

మరిన్ని వార్తలు