ఏడో తరగతి నుంచి ప్రేమ.. కాదనడంతో టెన్త్‌ విద్యార్థి..

16 Mar, 2022 12:32 IST|Sakshi

సాక్షి, నిజామబాద్‌: జక్రాన్‌పల్లి మండలంలోని తొర్లికొండలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఓ విద్యార్థి పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇందుకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి జిల్లా పెద్దకొడప్‌గల్‌ మండ లంలోని ఓ గ్రామానికి చెందిన విద్యార్థి తొర్లికొండలోని సాంఘిక సంక్షేమ శాఖ ఎస్సీ బాలుర వసతి గృహంలో ఉంటూ జెడ్పీ ఉన్నత పాఠశాలలో టెన్త్‌ చదువుతున్నాడు. అయితే మంగళవారం ఉదయం హాస్టల్‌ నుంచి పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయులు తెలిపారు.

పాఠశాలలో రెండో పీరియడ్‌ జరుగుతున్న సమయంలో సదరు విద్యార్థి వచ్చినట్లు తెలిపారు. తరగతులు జరుగుతున్న సమయంలో బిల్డింగ్‌పైకి ఎక్కి అక్కడి నుంచి దూకాడని తెలిపారు. గట్టిగా శబ్ధం రావడంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఒక్కసారిగా బయటకు వచ్చి చూశారు. విద్యార్థికి తీవ్రగాయాలవడంతో 108 అంబులెన్స్‌లో ఆర్మూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే కిరణ్ ఓ బాలికను ఏడో తరగతి నుంచే ఇష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని వివరాలు అడగగా తాను ఒక అమ్మాయిని ప్రేమించానని తెలిపాడు. పాఠశాల ఆవరణలో కింద ఓ అమ్మాయితో కాసేపు మాట్లాడానని పేర్కొన్నాడు. అదే సమయంలో బిల్డింగ్‌పైకి ఎక్కి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని చెప్పాడు. ఇద్దరి మధ్య ప్రేమ విఫలం కావడంతో విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఆస్పత్రికి ఎంఈవో శ్రీనివాస్, పీఆర్‌టీయూ మండలాధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గోపి వచ్చి సదరు విద్యార్థితో మాట్లాడారు. 

మరిన్ని వార్తలు