చిన్నారి ప్రాణం తీసిన పబ్జీ గేమ్ గొడవ!

5 Apr, 2021 19:46 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలోని మంగళూరులో పిల్లల చేతికి సెల్‌ఫోన్‌ ఇవ్వడంతో ఓ విషాద సంఘటన జరిగింది. పబ్జీ గేమ్ విషయంలో ఇద్దరు చిన్నారుల మధ్య జరిగిన గొడవ వల్ల 12 ఏళ్ల చిన్నారి ప్రాణం బలైపోయింది. స్నేహితుడిని కలవాలని చెప్పి ఇంటి నుంచి బయలుదేరిన 10 గంటల తర్వాత ఇంటి నుంచి 500 మీటర్ల దూరంలో శవమై కనిపించాడు. ఇండియాలో నిషేధించిన పబ్జీ వీడియో గేమ్‌ బాలుడు మరణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసులో ప్రశ్నించేందుకు 17 ఏళ్ల మైనర్‌ బాలుడైన నిందితుణ్ని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

చనిపోయిన మహ్మద్ అకీఫ్ లారీ డ్రైవర్ హనీఫ్ కుమారుడుగా గుర్తించారు. అకీఫ్ ఎప్పుడు కొంతమంది పరిచయస్తులతో పబ్జీ గేమ్ ఆడేవాడు. ఫలా స్కూల్‌లో 6వ తరగతి చదువుతున్న బాలుడు శనివారం రాత్రి 8.45 గంటల సమయంలో ఇంటి నుంచి ఫోన్‌లో మాట్లాడుతూ బయటికి వెళ్ళాడు. ఎంతసేపటికి బాలుడు తిరిగి రాకపోయేసరికి వారు పోలీసులకు పిర్యాదు చేశారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో ఉల్లాల్ పోలీస్ స్టేషన్ పరిమితిలో ఉన్న స్కూల్ అరటి ఆకులు, కొబ్బరి ఫ్రాండ్లతో కప్పబడిన ఒక బాలుడి మృతదేహాన్ని పోలీసు బృందం గుర్తించింది. ఆ బాలుడి మృతదేహాన్ని తల్లిదండ్రులు గుర్తించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం వెన్‌లాక్ ఆసుపత్రికి తరలించారు. 

అకీఫ్‌ అనే చిన్నారిని ఇంటి పక్కన ఉండే మరో బాలుడు తనతో పాటు పబ్జీ ఆడాల్సిందిగా కోరాడు. అయితే ఆట మధ్యలో ఇద్దరి మధ్యా మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసింది. అకీఫ్‌ తోటి బాలుడిపై రాళ్లు విసిరాడు. దానికి కోపోద్రిక్తుడైన ఆ బాలుడు ఓ పెద్ద రాయిని అకీఫ్‌పై వేశాడు. దీంతో అతడికి తీవ్రంగా రక్తస్రావమై అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. భయపడ్డ ఆ బాలుడు మృతదేహాన్ని అరిటాకులతో కప్పేసి అక్కడి నుంచి పారిపోయాడని పోలీసు అధికారి తెలిపారు. నిందితుడు మైనర్‌ కావడంతో అతడికి ఎవరైనా సహకరించారా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై నగర పోలీస్‌ కమిషనర్‌ ఎన్‌.శశి కుమార్‌ స్పందిస్తూ చిన్నారులకు ఫోన్లు ఇచ్చినప్పుడు పెద్దలు ఓ కంట కనిపెడుతూ ఉండాలని సూచించారు.

చదవండి:

తల్లి టీవీ ఆఫ్‌ చేసిందని కొడుకు ఆత్మహత్య

మయన్మార్‌లో ఆగని అరాచకం.. 550 మంది మృతి

మరిన్ని వార్తలు