వృద్ధురాలి బ్యాగ్‌లో 13 బుల్లెట్లు 

6 Oct, 2021 05:47 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): విశాఖ విమానాశ్రయంలో ఒక వృద్ధురాలి బ్యాగ్‌లో 13 బుల్లెట్లు దొరికాయి. విశాఖ నగరానికి చెందిన త్రిపురాణి సుజాత (70) బ్యాగ్‌లో ఈ బుల్లెట్లు లభించినట్లు విమానాశ్రయం పోలీసులు తెలిపారు. హైదరాబాద్‌ వెళ్లేందుకు మంగళవారం సాయంత్రం విమానాశ్రయానికి వచ్చిన ఆమె బ్యాగ్‌ను స్కానర్‌లో తనిఖీ చేసినప్పుడు ఈ బుల్లెట్లు బయటపడ్డాయని చెప్పారు. ఆమెను ఎయిర్‌పోర్టు పోలీస్‌ స్టేషన్‌కు తీసుకెళ్లి ఏసీపీ శ్రీపాదరావు, సీఐ ఉమాకాంత్‌ విచారించారు.

తమ పాత ఇంట్లో వస్తువులు సర్దానని, ఈ క్రమంలో పాత బ్యాగ్‌లో కొన్ని దుస్తులు పెట్టుకుని హైదరాబాద్‌ బయలుదేరానని ఆమె తెలిపారు. గతంలో తన పెదనాన్న వేటకు వెళ్లేవారని, ఈ బుల్లెట్లు ఆయనవై ఉంటాయని చెప్పారు. బ్యాగ్‌లో బుల్లెట్లు ఉన్నట్లు తనకు తెలియదని, తనిఖీల్లో బయట పడినప్పుడే చూశానని తెలిపారు. ఆమెకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. సుజాత చెబుతున్న విషయాల్లో ఎంతవరకు నిజముందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.   

>
మరిన్ని వార్తలు