న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని.. వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నానని చెప్పి..

30 Jan, 2022 04:51 IST|Sakshi
సీజ్‌ చేసిన నగదును పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ

యువతి నుంచి రూ.17 లక్షలకు పైగా గుంజేసిన వ్యక్తి

ఆమె ఫిర్యాదుతో నిందితుడి అరెస్ట్‌

నేరగాడిపై తెలుగు రాష్ట్రాల్లో ఇదివరకే 16 కేసులు నమోదు

ఒంగోలు: పెళ్లి సంబంధం పేరుతో యువతి, ఆమె తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి రూ.17 లక్షలకు పైగా గుంజేసిన వ్యక్తిని ప్రకాశం జిల్లా ఒంగోలు పోలీసులు అరెస్ట్‌ చేశారు. కేసు వివరాలను జిల్లా ఎస్పీ మలికాగర్గ్‌ శనివారం మీడియాకు చె ప్పారు. తూర్పుగోదావరి జిల్లాకి చెందిన పొట్లూరి శ్రీబాలవంశీకృష్ణ అలియాస్‌ ప్రతాపనేని రాజేష్‌ కుమార్‌ (35) తెలంగాణలోని ఖమ్మం జిల్లా బుర్హాంపురం మండలం వెంకటేశ్వర నగర్‌లో ఉంటున్నాడు.

ఇతనికి విజయవాడలో కూడా నివాసముం ది. 2008లో కాకినాడలోని ఓ ఇంజనీరింగ్‌ కాలేజీలో రాజేష్‌ బీ ఫార్మశీ పూర్తి చేశాడు. 2011లో వి వాహం చేసుకుని భార్యతో కలిసి బెంగళూరులో నివాసమున్నాడు. అక్కడ వ్యసనాలకు బానిసై అప్పులు చేయడంతో భార్య విడాకులిచ్చింది. కొంతకాలం ఏటీఎం నేరాలకు పాల్పడి డబ్బులు సంపాదించిన రాజేష్‌ బ్యాంకర్లు వన్‌టైం పాస్‌వర్ట్‌ సిస్టం ప్రారంభించడంతో ఆ నేరాలు చేయడం కుదరక మేట్రిమోనియల్‌ చీటింగ్‌కు తెరలేపాడు. 

మోసం చేసిన తీరు ఇదీ...
2021 ఆగస్ట్‌లో ఓ మేట్రిమోనియల్‌ వెబ్‌సైట్‌లో ప్రతాపనేని రాజేష్‌కుమార్‌ పేరుతో అకౌంట్‌ ఓపెన్‌ చేశాడు. ఓ యువతి తల్లిదండ్రులు రాజేష్‌ వివరా లను అందులో పరిశీలించి అతడిని ఫోన్‌లో సంప్రదించారు. తాను న్యూయార్క్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినని, కరోనా పరిస్థితుల కారణంగా హైదరాబాద్‌కు బదిలీ అయి వర్క్‌ ఫ్రం హోమ్‌ చేస్తున్నట్లు రాజేష్‌ వారిని నమ్మించాడు. తాను మళ్లీ ఈ ఏడాది మే లో న్యూయార్క్‌ వెళ్లాల్సి ఉంటుందని, ఈ లోగా  ఆమె సిబిల్‌ స్కోర్‌ పెరగాలని వారిని నమ్మించాడు. అనంతరం యువతి క్రెడిట్‌ కార్డు, వివిధ మార్గాల ద్వారా రూ.17.49 లక్షలను రాజేష్‌ తన బ్యాంక్‌ ఖాతాలో జమ చేసుకున్నాడు.  

స్పందన ఫిర్యాదుతో రంగంలోకి...
తన క్రెడిట్‌ కార్డుల ద్వారా ఇష్టం వచ్చినట్లుగా రాజేష్‌ రుణాలు తీసుకుంటుండటంతో యువతికి అనుమానం వచ్చింది.దీంతో ఆమె తన రుణాల ప్రాసెస్‌ మొత్తం రద్దు చేయాలని అడగ్గా అందుకు వారం రోజులు గడువు పడుతుందంటూ రాజేష్‌ చెప్పాడు. దీంతో ఆమె స్పందనలో ఫిర్యాదు చేసింది. ఎస్పీ మలికాగర్గ్‌ ఆదేశాల మేరకు రూరల్‌ సీఐ రాంబాబు, మద్దిపాడు ఎస్‌ఐ శ్రీరాం విచారించి నిందితుడిని సీతారామపురం కొష్టాలు వద్ద అరెస్ట్‌ చేశారు. విచారణలో అతనిపై తెలుగు రాష్ట్రాల్లో 16 కేసులు నమోదైనట్లు గుర్తించారు. అతడి నుంచి రూ.8 లక్షలు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. స్వల్ప కాలంలోనే నిందితుడిని అరెస్ట్‌ చేసినందుకుగాను పోలీసులను ఎస్పీ మలికాగర్గ్‌ అభినందించి నగదు రివార్డులను అందజేశారు. 

మరిన్ని వార్తలు