బొప్పాయి తోటలోకి బాలుడు, ప్రశ్నించిన వృద్ధురాలిపై దారుణం

21 May, 2021 13:25 IST|Sakshi

17 ఏళ్ల బాలుడు జువైనెల్‌ కోర్టుకు.. 

ఒంగోలు(ప్రకాశం జిల్లా): పదిహేడేళ్లు బాలుడు ఓ వృద్ధురాలిని హత్య చేసి, ఆపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన జిల్లాలో ఆలస్యంగా వెలుగు చూసింది. దీనికి సంబంధించిన వివరాలను ఒంగోలు డీఎస్పీ కె.వి.వి.ఎన్‌.వి.ప్రసాద్‌ గురువారం మీడియాకు వెల్లడించారు. టంగుటూరు మండలం మల్లవరప్పాడుకు చెందిన నాగినేని రంగారావు తన రొయ్యల చెరువుల వద్ద రెండు నెలలుగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన 17 ఏళ్ల బాలుడు పని చేస్తున్నాడు. ఈనెల 14న రంగారావు తన బొప్పాయితోటలో పని చేసేందుకు బాలుడిని పంపాడు. అదే రోజు తోటలో రంగారావు తల్లి వెంకట రవణమ్మ(63) హత్యకు గురైంది.

బొప్పాయి తోటలో పని చేసుకుంటున్న తన తల్లిని గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారంటూ ఈనెల 15న రంగారావు టంగుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో బాలుడి వ్యవహారం బట్టబయలైంది. 14వ తేదీన తోటకు వెళ్లి గేటు తీస్తున్న బాలుడితో అక్కడే కలుపుతీస్తున్న రంగారావు తల్లి వెంకట రవణమ్మ(63) గొడవ పడింది. అది కాస్తా దూషణల వరకు వెళ్లింది. ఆగ్రహించిన బాలుడు తనను దూషించిన రవణమ్మను తోటలో ఉన్న దోకుడుపారతో తలపై బలంగా మోదాడు.


మీడియాకు వివరాలు వెల్లడిస్తున్న ఒంగోలు డీఎస్పీ ప్రసాద్‌

ఆమె వద్ద ఉన్న కండువాతో మెడకు బిగించాడు. ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్టు భావించి ఫెన్సింగ్‌ పక్కనే ఉన్న బండరాయితో తలపై మోది హత్య చేశాడు. అంతటితో ఆగక ఆమెపై లైంగిక దాడికి కూడా పాల్పడ్డాడని పోలీసుల విచారణలో స్పష్టం కావడంతో బాలుడిని గురువారం మధ్యాహ్నం టంగుటూరులో పోలీసులు అదుపులోకి తీసుకుని, జువైనల్‌ కోర్టులో హాజరు పరిచినట్లు డీఎస్పీ ప్రసాద్‌ తెలిపారు. ఈ సమావేశంలో సింగరాయకొండ సీఐ యు.శ్రీనివాసరావు, టంగుటూరు ఎస్సై నాయబ్‌రసూల్‌ ఉన్నారు.

చదవండి: రైస్‌పుల్లింగ్‌: రాగిపాత్రకు రంగుపూసి..  
దుర్గ హత్య కేసు: అందరూ ఒకే కుటుంబానికి  చెందినవారు

మరిన్ని వార్తలు