Nalgonda Munugode: స్నేహితుడి పుట్టిన రోజు.. బిర్యానీ కోసం వెళ్తూ.. మృత్యుఒడికి

29 Sep, 2022 12:47 IST|Sakshi
మణికంఠ (ఫైల్‌)  

సాక్షి, నల్గొండ: స్నేహితుడి పుట్టిన రోజు వేడుకను పురస్కరించుకుని బిర్యానీ కోసం మునుగోడుకు బయలుదేరిన స్నేహితుల బృందంలో ఒకరిని ట్రాక్టర్‌ రూపంలో మృత్యువు కబళించింది. ఈ విషాదకర ఘటన మునుగోడు మండలం గూడపూర్‌ గ్రామ సమీపంలో చోటు చేసుకుంది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కొరటికల్‌ గ్రామానికి చెందిన దండు మణికంఠ(18) స్నేహితుల్లో ఒకరిది పుట్టిన రోజు.

ఆ వేడుకను పురస్కరించుకుని మణికంఠ మరో ఎనిమిది మంది స్నేహితులతో కలిసి బిర్యానీ కోసం ఆటోలో మునుగోడుకు బయలుదేరారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కంభాల శేఖర్‌ ట్రాక్టర్‌ నడుపుకుంటూ కోరటికల్‌కు వస్తున్నాడు. గూడపూర్‌ సమీపంలోకి రాగానే స్నేహితులతో వెళ్తున్న ఆటో ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ వెనక చక్రానికి తగిలింది.

ఈ ప్రమాదంలో ఆటోలో డ్రైవర్‌ సీటు పక్కనే కూర్చొని ప్రయాణిస్తున్న మణికంఠ ట్రాక్టర్‌ చక్రం తగిలి కిందపడి పోయాడు. తీవ్రంగా గాయపడిన అతడిని 108 వాహనంలో నల్లగొండ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. దీంతో మృతుడి స్వగ్రామం కొరటికల్‌లో విషాదం అలుముకుంది.  ·

మరిన్ని వార్తలు