‘‘శరద్‌ పవార్‌ను మాట్లాడుతున్నా.. అతడ్ని బదిలీ చేయండి’’

13 Aug, 2021 13:04 IST|Sakshi

ముంబై :  నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ స్వరాన్ని అనుకరించి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని గురువారం ముంబై క్రైమ్‌ బ్రాంచ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. పుణెకు చెందిన వికాష్‌ గౌరవ్‌, కిరణ్‌ కక్డేలు నిరుద్యోగులు. డబ్బు సంపాదన కోసం ఎన్‌సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ స్వరాన్ని అనుకరిస్తూ బెదిరింపులకు దిగుతున్నారు. గత బుధవారం రెవన్యూ శాఖలోని ఓ అధికారికి.. శరద్‌ పవార్‌ స్వరాన్ని అనుకరిస్తూ నిందితులలో ఒకడు ఫోన్‌ చేశాడు. ‘‘ నేను శరద్‌ పవార్‌ని మాట్లాడుతున్నా.. మీ శాఖలోని జూనియర్‌ ఆఫీసర్‌ను వేరే శాఖలోకి బదిలీ చేయండి’’ అని చెప్పాడు.

ఈ సందర్భంగా తాను సిల్వర్‌ ఓక్‌లోని శరద్‌ పవార్‌ ఇంటి నుంచి మాట్లాడుతున్నానని చెప్పాడు. అయితే, ఆ ఫోన్‌ కాల్‌పై అనుమానం వచ్చిన అధికారి పవార్‌ ఇంటికి ఫోన్‌ చేశాడు. శరద్‌ పవార్‌ ఢిల్లీలో ఉన్నారని తెలిసింది. దీంతో ఫోన్‌ కాల్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన క్రైమ్ బ్రాంచ్‌ పోలీసులు నిందితులు ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్నారు. ఈ ఇద్దరు గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.

మరిన్ని వార్తలు