దారుణం: రోడ్డుపైనే.. చచ్చిపోయేంత వరకు..

16 Mar, 2021 14:29 IST|Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో దారుణం చోటుచేసుకుంది. తమ బైక్‌ను ఢీకొట్టారనే ఆగ్రహంతో టీనేజర్లు, ఇద్దరిని పాశవికంగా హత్య చేశారు. కత్తితో  పొడిచి, బాధితులు రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతుంటే చూసి ఆనందిస్తూ రాక్షసంగా ప్రవర్తించారు. వారు చనిపోయారని నిర్ధారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోహిత్‌ అగర్వాల్‌(23), ఘన్‌శ్యామ్‌ (20) అర్ధరాత్రి సమయంలో ఉద్యోగ్‌  విహార్‌ మెట్రో స్టేషన్‌ వర్గంలో స్కూటీ‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో నిందితుల  బైక్ను ఢీకొట్టారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. చినికి చినికి గాలివానలా మారి నలుగురు పరస్పరం దాడులకు దిగారు.

ఇంతలో ఓ నిందితుడు కత్తి తీసి, రోహిత్, ఘన్‌శ్యామ్‌ను పొడిచారు. అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో, మరో నిందితుడు వారిద్దరిపై పిడిగుద్దులు కురిపిస్తూ కింద పడేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి మరోసారి బాధితులను తీవ్రంగా కొట్టారు. చనిపోయేంత వరకు కత్తితో పొడుస్తూనే ఉన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. వీటి ఆధారంగా నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఒకరు మైనర్‌ అని, మరొకరు ప్రదీప్‌ కోహ్లి(19) అని పేర్కొన్నారు. అన్ని కోణాల్లో విచారణ చేపట్టామని, నిందితుల బైక్, వారు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
చదవండిస్వేచ్ఛ కోసం ఇల్లు వదిలింది.. మృగాడికి బలయ్యింది

మరిన్ని వార్తలు