పిల్లలు పుట్టలేదనే అక్కసుతోనే చిన్నారి హత్య

19 Jun, 2021 13:13 IST|Sakshi
చిన్నారి ఉమామహేశ్వర్‌ మేనమామ, అత్త ( ఫైల్‌ ఫోటో )

సాక్షి, అబ్దుల్లాపూర్‌మెట్‌:మండలంలోని అనాజ్‌పూర్‌ గ్రామంలో ఇంట్లోని నీటి ట్యాంకులో రెండు నెలల చిన్నారి మృతదేహం లభ్యమవడం స్థానికంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. కాగా చిన్నారి అనుమానాస్పద మృతి వెనుక ఉన్న మిస్టరీ వీడింది. ఈ ఘటనను పోలీసులు హత్యకేసుగా తేల్చారు. తమకు పిల్లలు పుట్టలేదనే అక్కసుతోనే చిన్నారి మేనమామ, అత్త ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు ధృవీకరించారు. ఇప్పటికే వారిని అరెస్టు చేసిన పోలీసులు తమ విచారణను కొనసాగిస్తున్నారు.

విషయంలోకి వెళితే.. అనాజ్‌పూర్‌కు చెందిన మంచాల రంగయ్య కూతురు లతకు ఇబ్రహీంపట్నం మండలం నెర్రపల్లి నివాసి దూసరి తిరుమలేశ్‌తో పన్నెండేళ్ల కింద పెళ్లయింది. అప్పటినుంచి దంపతులకు సంతానం కలగలేదు. రెండు నెలల కిందటే వారికి బాలుడు జన్మించగా, ఉమామహేశ్వర్‌ అని పేరు పెట్టుకున్నారు. బాబు పుట్టినప్పటి నుంచి అనాజ్‌పూర్‌లోని పుట్టింట్లో తమ్ముడు బాల్‌రాజ్, మరదలు శ్వేతతో కలసి లత ఉంటోంది. తిరుమలేశ్‌ తరచూ వచ్చి భార్య, కొడుకును చూసి వెళ్తుండే వాడు. అయితే గురువారం రాత్రి అందరూ భోజనం చేసిన తర్వాత లత తన బాబును పక్కనే పడుకోపెట్టుకుని నిద్రించింది. శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమె లేచిచూడగా కుమారుడు కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురై విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. చివరకు ఇంటిపై ఉన్న వాటర్‌ ట్యాంక్‌లో బాలుడు విగతజీవిగా తేలాడు. 

చదవండి: దారుణం: రాత్రి తల్లి చెంత.. తెల్లారేసరికి నీళ్ల ట్యాంకులో


 

మరిన్ని వార్తలు