మూడేళ్ల ప్రేమ.. మరో అమ్మాయితో నిశ్చితార్థం జరగడంతో..

29 Sep, 2021 10:40 IST|Sakshi
అల్లం ప్రసన్న (ఫైల్‌)

సాక్షి,పెద్దపల్లి: మూడేళ్లపాటు ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాటిచ్చిన ప్రేమికుడు మోసం చేసి మరో అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకోవడంతో మనస్తాపంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఓదెలలో జరిగింది. ఓదెల మండలం పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఓదెల గ్రామానికి చెందిన అల్లం ప్రసన్న (21) ప్రేమ విఫలమైనందుకు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది.

పొత్కపల్లి ఎస్సై శీలం లక్ష్మణ్, ట్రెయినీ ఎస్సై వంశీకృష్ణరెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి..ఓదెల గ్రామానికి చెందిన అల్లం రమేశ్‌–సంధ్య దంపతులకు ఇద్దరు కూతుర్లు. పెద్ద కూతురు ప్రసన్న హన్మకొండలో ప్రయివేట్‌ కళాశాలలో డిగ్రీ ఫైనల్‌ ఇయర్‌ చదువుతోంది. ప్రసన్న ఇదే గ్రామానికి చెందిన రాంనేని సందీప్‌ మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పిన సందీప్‌ ఇటీవల వేరే అమ్మాయితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నాడు.

విషయం తెలుసుకున్న ప్రసన్న కలతచెంది తట్టుకోలేక సోమవారం ఉదయం ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగగా చికిత్సకోసం కరీంనగర్‌ ప్రయివేట్‌ ఆస్పత్రికి తరలించగా రాత్రి మృతిచెందింది. ప్రసన్న మృతితో ఓదెలలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. మృతురాలి తండ్రి అల్లం రమేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సైలు తెలిపారు. రాంనేని సందీప్‌ అతడి తల్లిదండ్రులు రాంనేని రాజు, రాజేశ్వరీపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

చదవండి: మరో వ్యక్తితో వివాహం.. ప్రియునితో కలిసి వివాహిత ఆత్మహత్య

మరిన్ని వార్తలు