-

టౌటే తుపాను: నౌక ప్రమాదంలో 22 మంది మృతి

19 May, 2021 15:59 IST|Sakshi

ముంబై: రెండు రోజుల క్రితం ‘టౌటే’ తుపాను ధాటికి ముంబై తీరానికి 35 నాటికల్ మైళ్ల దూరంలో 261 మంది ప్రయాణిస్తున్న బార్జ్ పీ-305 భారీ నౌక పెద్ద బండ రాయిని ఢీకొనడంతో మునిగిపోయిన సంగతి తెలిసిందే. అరేబియా సముద్రంలో మునిగిపోయిన ఈ  ఘటనలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్‌కు నాయకత్వం వహిస్తున్న నేవీ 22 మంది మృతదేహాలను బుధవారం గుర్తించి వెలికి తీసింది. ఇప్పటి వరకు బార్జ్ పీ-305లో నౌకలో ప్రయాణిస్తున్న 188 మందిని నావికా దళ సిబ్బంది కాపాడింది. మిగిలిన వారిని గుర్తించి, రక్షించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఇంకా 51 మంది ఒఎన్జీసీ కార్మికులు కనిపించలేదు. 

నావికా నౌకలు టెగ్, బెట్వా, బియాస్, అలాగే పీ 8ఐ విమానం, సీ కింగ్ హెలికాప్టర్లు సెర్చ్ & రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్నట్లు నావికా దళం పేర్కొంది. అలల ధాటికి గత సోమవారం సాయంత్రం పీ-305 సహా మూడు బార్జ్‌లు, ఒక ఆయిల్‌ రిగ్‌ కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. గాల్‌ కన్స్‌ట్రక్టర్‌కు చెందిన బార్జ్‌ కొట్టుకుపోగా.. అందులోని 137 మందిని నేవీ సిబ్బంది రక్షించారు. ఎస్‌ఎస్‌-3 అనే బార్జ్‌పై ఉన్న 196 మంది సిబ్బంది, ఓఎన్జీసీ డ్రిల్లింగ్‌ రిగ్‌ ‘సాగర్‌భూషణ్‌’పై ఉన్న 101 మంది సురక్షితంగా ఉన్నట్లు నౌకాదళ అధికారులు వెల్లడించారు. సముద్రంలో నెలకొన్న కఠిన వాతావరణ పరిస్థితుల దృష్ట్యా సహాయక చర్యలు ఆలస్యమవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.

చదవండి:
ముంబైని అతలాకుతలం చేసిన తుపాను

మరిన్ని వార్తలు