Hyderabad Crime News: భరించలేని తలనొప్పి, వాంతులు, నోట్లో నుంచి నురుగ వచ్చి

2 Aug, 2022 12:54 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఐసీఐసీఐ బ్యాంకులో పని చేస్తున్న ఓ యువతి తలనొప్పి భరించలేక మరణించిన సంఘటన నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కింగ్‌కోఠి ప్రాంతంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్‌ రాపోలు శ్రీనివాస్‌రెడ్డి సమాచారం మేరకు... నిజామాబాద్‌ జిల్లా పెద్దభీంగల్‌ గ్రామానికి చెందిన కొత్తపల్లి అనూష(22) నాలుగు నెలల క్రితం నగరానికి వచ్చింది. అబిడ్స్‌లోని ఐసీఐసీఐ బ్యాంక్‌లో క్యాషీయర్‌గా పనిచేస్తూ కింగ్‌కోఠి షేర్‌గేట్‌ దగ్గర ఉన్న సింధూజ హాస్టల్లో నివాసం ఉంటోంది.

సోమవారం తన స్నేహితురాలితో కలసి డ్యూటీకి వెళ్లింది. అప్పటికే తలనొప్పి, వికారంగా ఉండటంతో ఆఫీస్‌కు వెళ్లిన గంటకు వాంతు చేసుకుంది. వెంటనే తాను పనిచేయలేనని మేనేజర్‌ పర్మిషన్‌ తీసుకుని హాస్టల్‌కు వచ్చింది. కొద్దిసేపటికే తలనొప్పి ఎక్కువ కాడంతో పక్క రూమ్‌ మేట్‌ ఒకామే జండూబామ్‌ రాసి తలకు మసాజ్‌ చేసింది.

అయినా సాయంత్రం 4 గంటల సమయంలో తీవ్ర తలనొప్పి, ఒళ్లంతా చెమటలు పట్టి, కనుగుడ్లు తేలేస్తుండటంతో.. ఆందోళన చెందిన స్నేహితులు అనూషను ఆసుపత్రికి తీసికెళుతున్న క్రమంలో మరోసారి వాంతి చేసుకుంది. ఆటోలో ఎక్కించాక నోటి నుంచి నురగ వచ్చి అపస్మారక స్థితికి చేరుకుంది. సమీపంలోని కింగ్‌కోఠి ఆసుపత్రికి తీసికెళ్లగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు.
చదవండి: అనుమానమే పెనుభూతమై.. భార్యను హత్య చేసి, భర్త ఆత్మహత్య 

మరిన్ని వార్తలు