15 రోజుల్లో పెళ్లి.. అంతలోనే.. 

15 May, 2021 14:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

కరోనాతో యువకుడి మృతి 

చిట్యాల: పెళ్లి పీటలెక్కాల్సిన ఓ యువకుడు కోవిడ్‌ బారిన పడి కన్నుమూశాడు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం తిర్మలాపూర్‌ గ్రామానికి చెందిన డబ్బాల రాజేశ్‌(24) కరోనాతో శుక్రవారం మృతి చెందాడు. రెండు రోజుల క్రితం చేయించుకున్న పరీక్షలో రాజేష్‌కు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో శ్వాస సమస్యలు తలెత్తగా మెరుగైన వైద్యం కోసం చిట్యాల సివిల్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం మృతి చెందాడు. కాగా, రాజేష్‌కు ఇటీవలే వివాహం నిశ్చయమైంది. మరో పదిహేను రోజుల్లో వధూవరులకు వివాహం జరిపించేందుకు ముహూర్తం నిర్ణయించారు. ఈలోగా రాజేష్‌ మృతి చెందడంతో రెండు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. 

కరోనా రోగి ఆత్మహత్య 
నర్సింహులపేట:  కరోనా భయంతో మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలంలోని పడమటిగూడెం గ్రామంలో పాలవెల్లి లింగయ్య (35) అనే వ్యక్తి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు ఐదు రోజుల క్రితం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి ఇంట్లోనే ఉంటూ చికిత్స పొందుతున్న లింగయ్య శుక్రవారం వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చెట్టుకు ఉరి వేసుకున్నాడు.

చదవండి: అమానుషం: నిండు గర్భిణీపైనా.. దయ చూపలేదు 

మరిన్ని వార్తలు