ముంబై ఉగ్రదాడి మాస్టర్‌మైండ్‌కు శిక్ష ఖరారు

8 Jan, 2021 17:08 IST|Sakshi

జకీ ఉర్ రెహ్మాన్ లఖ్వీ  దోషిగా తేల్చిన పాకిస్తాన్‌ కోర్టు 

ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థిక సాయం

15 సంవత్సరాల జైలు శిక్ష, జరిమానా

సాక్షి, న్యూఢిల్లీ : ముంబై ఉగ్రదాడి సూత్రధారి లష్కరే తోయిబా ఆపరేషన్స్ కమాండర్  జకీ ఉర్‌ రెహ్మాన్‌ రెహ్మాన్‌ లఖ్వికి  (61) పాకిస్తాన్‌ కోర్టు భారీ షాకే ఇచ్చింది. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆర్థిక సాయం అందిస్తున్నాడన్న ఆరోపణలపై 15 ఏళ్ళ జైలు శిక్ష విధించింది.  ఉగ్రవాద నిరోధక చట్టం 1997 లోని వివిధ సెక్షన్ల కింద  ఈ  శిక్షను ఖరారు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎజాజ్ అహ్మద్ బుట్టార్  శుక్రవారం తీర్పు చెప్పారు. లఖ్వీకి మూడు కౌంట్స్‌ చొప్పున ఐదేళ్ల కఠిన  కారాగార జైలు శిక్ష విధించారు. అలాగే  లక్ష పాకిస్తాన్‌ రూపాయల జరిమానా కూడా విధించారు.  జరిమానా చెల్లించడంలో  విఫలమైతే, ఒక్కోదానికి ఆరు నెలల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. తీర్పు అనంతరం లఖ్విని తరలించామని  అధికారి తెలిపారు. (ముంబై ఉగ్రదాడి సూత్రధారి లఖ్వీ అరెస్టు)

ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నాడన్న ఆరోపణలపై  రెహ్మాన్ లఖ్వీని ఇటీవల అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే.  కాగా ముంబై దాడుల తర్వాత ఐక్యరాజ్యసమితి లఖ్వీని ప్రపంచ ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. అనంతరం లఖ్వీని పాక్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఆరు సంవత్సరాల జైలు శిక్ష అనంతరం.. 2015లో రావల్పిండి జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యాడు. లఖ్విని పంజాబ్ ప్రావిన్స్‌కు చెందిన తీవ్రవాద నిరోధక విభాగం (సీటీడీ) గత వారం అరెస్ట్‌ చేసింది. సిటిడి నమోదు చేసిన కేసులో  లఖ్వీని యాంటీ టెర్రరిజం కోర్ట్ (ఎటిసి) లాహోర్ దోషిగా తేల్చింది. అయితే ఈ కేసులో తనను తప్పుగా ఇరికించారని లఖ్వీ కోర్టుకు విజ్ఞప్తి చేశాడు.

మరిన్ని వార్తలు