లక్ష మంది నుంచి రూ.300 కోట్లు స్వాహా

10 Jan, 2021 10:11 IST|Sakshi

దోచుకో.. పెట్టుబడులతో దాచుకో..

సాక్షి, చెన్నై : ‘ఎలాంటి ష్యూరిటీ లేకుండా కోరినంత అప్పుకావాలా.. అయితే సంప్రదించండి’ అనే ఆకర్షణీయమైన ప్రచారాలు, ఆన్‌లైన్‌ మోసాలు కుటుంబాలను కూలదోస్తున్నాయి. అమాయకుల నుంచి దోచుకున్న రూ. 300 కోట్లను పెట్టుబడులుగా మార్చి దాచుకుంటున్న ముఠా బెంగళూరులో పట్టుబడడంతో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.  చెన్నై వేంగైవాసల్‌కు చెందిన గణేశన్‌ ఆన్‌లైన్‌ యాప్‌ ద్వారా రుణం పొంది బెదిరింపులకు గురవుతున్నట్లు పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. సెంట్రల్‌ క్రైంబ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేసి బెంగళూరుకు కేంద్రంగా చేసుకుని కాల్‌సెంటర్‌ నిర్వహిస్తూ మోసాలకు పాల్పడుతున్న జీయోయామావో (38), వ్యూయానులం (23) అనే ఇద్దరు చైనీయులను, వీరి భాగస్వాములైన ప్రమోదా, భవాన్‌ అనే ఇద్దరిని అరెస్ట్‌ చేశారు. అతి స్పల్పకాలంలో లక్ష మంది నుంచి 36 శాతం వడ్డీపై రుణాలు ఇచ్చి రూ. 300 కోట్ల వరకు చట్ట వ్యతిరేకంగా ఆర్జించినట్లు విచారణలో తేలింది.

అధికారులు కథనం..
ఈ కేసులో ప్రధాన నిందితుడైన హాంగ్‌ అనే వ్యక్తి చైనాలో ఉంటూ భారతదేశమంతా మండలాల వారీగా కాల్‌ సెంటర్లను ప్రారంభించి స్థానికులను డైరెక్టర్లుగా నియమిస్తాడు. ఇలా ఆన్‌లైన్‌ మోసాలతో ఆర్జించిన సొమ్మును భారీ రియల్‌ ఎస్టేట్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టినట్టు కూడా బహిర్గతమైంది. అంతేగాక పెట్టుబడులకు ఢోకా లేని  అనేక కంపెనీల్లో మదుపు చేశారు. చైనీయులు భారత్‌లో అంత సులభంగా వ్యాపారాలు, కంపెనీలు స్థాపించేందుకు వీలులేదు. వీరి వెనుక నేరచరిత గలిగిన కొందరు భారతీయులు ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. కొద్ది పెట్టుబడులతో భారీ లాభార్జన కోసం చైనీయులతో చేతులు కలిపిన వారెవరని అధికారులు ఆరా తీస్తున్నారు. చైనాలో ఉన్న  ప్రధాన నిందితుడు హాంగ్‌ను అరెస్ట్‌ చేయడంపై న్యాయకోవిదులతో ఈడీ అధికారులు చర్చిస్తున్నారు.

మరిన్ని వార్తలు