స్వామీజీ కార్యక్రమంలో భారీ చోరీ.. 36 మంది భక్తుల గోల్డ్ చైన్లు మాయం.. మంగళసూత్రం కూడా..

20 Mar, 2023 13:57 IST|Sakshi

ముంబై: స్వయంప్రకటిత స్వామీజీ ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ముంబైలో నిర్వహించిన కార్యక్రమంలో భారీ చోరీ జరిగింది. శనివారం, ఆదివారం రెండు రోజుల పాటు మీరా రోడ్‌లోని  సలసార్ సెంట్రల్ పార్కు గ్రౌండ్‌లో పెద్ద ఎత్తున ఈ ఈవెంట్ నిర్వహించారు. స్వామీజీ ఆశీర్వాదం కోసం దాదాపు రెండు లక్షల మందికిపైగా భక్తులు తరలివచ్చారు. ఆయితే నిర్వాహకులు సరైన భద్రతా ఏర్పాట్లు చేయకపోవడంతో ఆదివారం సాయంత్రం ఇక్కడ దాదాపు తొక్కిసలాట లాంటి పరిస్థితి ఏర్పడింది. వేలమంది భక్తులు మధ్య తోపులాట జరిగి గందరగోళం నెలకొంది.

సరిగ్గా ఈ సమయంలోనే భక్తుల మెడలో ఉన్న బంగారు గొలుసులు మాయమయ్యాయి. మొత్తం 36 మంది బాధితులు తమ బంగారు ఆభరణాలను ఎవరో దొంగిలించారని లబో దిబోమన్నారు. స్వామీజీ కార్యక్రమంలో ఇలా జరుగుతుందని ఊహించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తన మెడలో మంగళసూత్రం కూడా పోయిందని ఓ మహిళా భక్తురాలు కన్నీటిపర్యంతమైంది. స్వామీజీ రోగాలను నయం చేస్తారని ఫోన్లో వీడియోలు చూసి ఇక్కడకు వెళ్లినట్లు చెప్పింది. తన రెండేళ్ల బిడ్డ ఆరోగ్యం బాగాలేదని, స్వామీజీ దగ్గరకు తీసుకెళ్తే నయం చేస్తారని కార్యక్రామానికి వచ్చినట్లు పేర్కొంది. కానీ తోపులాట జరిగి మంగళసూత్రం పోగొట్టుకోవడం బాధగా ఉందని కన్నీటి పర్యంతమైంది. కాగా.. కార్యక్రమంలో జరిగిన తోపులాటలో ఒక్కరు మాత్రమే గాయపడ్డారు. బంగారు ఆభరణాలు పోయినప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు.

శాంతాబెన్ మిథాలాల్ జైన్ ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని కొన్ని మూఢనమ్మకాల వ్యతిరేక సంస్థలు వ్యతిరేకించాయి. ఈ ఈవెంట్‌కు అనుమతి ఇవ్వొద్దని కోరుతూ  పోలీసులకు శుక్రవారం మెమోరాండం కూడా సమర్పించాయి.
చదవండి: నీట్‌గా స్కెచ్‌ వేశాడు.. నకిలీ పత్రాలతో బ్యాంకులోకి వెళ్లి

మరిన్ని వార్తలు