ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య.. 4 రోజుల క్రితమే మృతి

18 Sep, 2021 16:43 IST|Sakshi
ఫోటో కర్టసీ: ఇండియా టుడే

భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెల బలవన్మరణం

సంఘటన స్థలంలో తొమ్మిది నెలల మృతశిశువు

సాక్షి బెంగళూరు: ఒకే కుటుంబంలో అయిదుగురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకోవడం కర్ణాటకలలో కలకలం రేపుతోంది. మృతుల్లో నలుగురు పెద్దవాళ్లు, తొమ్మిది నెలల బాబు ఉన్నారు. అయితే వీరంతా నాలుగు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకోగా శుక్రవారం రాత్రి వెలుగులోకి వచ్చింది. బెంగుళూరు సమీపంలోని బ్యాడరహళ్లి నాల్గవ క్రాస్‌లో నివాసం ఉంటన్న హల్లిగెరె శంకర్‌  ‘శాసక’ పేరుతో మినీ పత్రిక నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఏమైందో ఏమో గాని కుటుంబంలోని అయిదుగురు విగత జీవులుగా కనిపించారు. ఇందులో నలుగురు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. తొమ్మిది నెలల  శిశువు నేలపై విగతజీవిగా పడి ఉన్నాడు.

మృతులను శంకర్‌ సతీమణి భారతి(50), కుమారుడు మధుసాగర్‌(27), కుమార్తెలు సించనా(33), సింధూరాణి(30)గా గుర్తించారు. మూడు రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాలేదు. దీంతో స్థానికులు శుక్రవారం సాయంత్రం ఇంటి కిటికీ అద్దాలను పగులగొట్టి చూడగా.. అయిదుగురూ విగతజీవులై కనిపించారు.మూడేళ్ల చిన్నారి ప్రేక్ష.. అన్నం, నీళ్లు లేక నీరసించి సొమ్మసిల్లిన స్థితిలో ఉంది. ఈ విషయాన్ని గుర్తించిన స్థానికులు బ్యాడరహళ్లి పోలీసులకు సమాచారమిచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని చిన్నారి ప్రేక్షను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

ఈ చిన్నారి మృతురాలు సించనా కుమార్తెగా గుర్తించారు. మృతి చెందిన తొమ్మిది నెలల ఆడ శిశువు ఎవరి బిడ్డ అనేది తెలియరాలేదు. శిశువును గొంతు పిసికి చంపినట్లు ఆనవాళ్లు ఉన్నాయని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఆత్మహత్యలు చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. సంపాదకుడు హళ్లిగెరె శంకర్‌ ఇంటిలో లేని సమయంలో ఈ ఘోరం జరిగిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.  
చదవండి: రోడ్డు వేసే వరకు పెళ్లి చేసుకోను: సీఎంకు కర్ణాటక యువతి లేఖ
మహిళ మృతదేహంపై 19 ఏళ్ల యువకుడు అత్యాచారం

మరిన్ని వార్తలు