వికారాబాద్‌లో ఘోర ప్రమాదం, ఐదుగురు మృతి

26 Dec, 2020 08:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వికారాబాద్ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి వద్ద జరిగిన ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు మృతి చెందగా మరికొంత మంది గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.  

ప్రమాదం జరిగిందిలా..
మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండా సర్పంచ్ చెందర్ నాయక్ ఇంటి ముందు కోటపల్లి-మోమిన్‌పేట ప్రధాన రోడ్డుపైన ఒకే కుటుంబానికి చెందినవారు ఆటోలో ఎక్కి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతలోనే తాండూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వచ్చి ఆటో ముందు ఆగింది. వెనుకాలే లారీ వేగంగా వస్తోంది. ఇది గమనించని ఆటో డ్రైవర్ బండి ముందుకు తీశాడు. దీంతో లారీ ఆటోను ఢీ కొట్టి రోడ్డు పక్కకు దూపుకెళ్లి మూడు పల్టీలు కొట్టింది. లారీ తాకిడికీ బస్సు కూడా కొద్దిగా ధ్వంసమైంది. ఆటోలో ఎక్కి కూర్చున్న కుటుంబ సభ్యుల్లో 5 మంది  అక్కడికక్కడే మృతి చెందారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. లారీలో ఉన్న వారూ తీవ్రంగా గాయపడి చావుబతుకుల్లో ఉన్నారు. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

మరిన్ని వార్తలు