సోలార్‌ స్కాం: సరితా నాయర్‌కు 6 ఏళ్ల జైలు

28 Apr, 2021 01:22 IST|Sakshi

కోజికోడ్‌: సోలార్‌ ప్యానెల్‌ కుంభకోణం కేసులో దోషిగా నిర్ధారణ అయిన సరితా నాయర్‌కు కేరళ న్యాయస్థానం 6 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. కేరళలో కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ సంకీర్ణ ప్రభుత్వాన్ని కుదిపేసిన ఈ కుంభకోణంలో సరిత రెండో నిందితురాలు. మూడో నిందితుడైన బి.మణిమోన్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ జ్యుడీషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌–3 కె.నిమ్మి మంగళవారం తీర్పు వెలువరించారు. మొదటి నిందితుడైన బిజు రాధాకృష్ణన్‌ ప్రస్తుతం కోవిడ్‌తో క్వారంటైన్‌లో ఉండటంతో జడ్జి అతడికి సంబంధించిన తీర్పును తర్వాత వెలువరించనున్నారు.

ఈ కేసులో మోసం సహా నాలుగు నేరాలకు గాను కోర్టు జైలు శిక్షలతోపాటు, రూ.10వేల చొప్పున రూ.40 వేల జరిమానా కూడా విధించింది. కోర్టు విచారణకు హాజరుకాకపోవడంతో గత వారమే పోలీసులు సరితను అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించా రు. కంపెనీ ఫ్రాంచైజీ ఇప్పించడంతోపాటు తన నివాసం, కార్యాలయాల్లో సోలార్‌ ప్యానెళ్లను అమరుస్తామంటూ సరితా నాయర్, బిజు రాధాకృష్ణన్‌ రూ.42.70 లక్షలు తీసుకుని మోసం చేశారంటూ కోజికోడ్‌కు చెందిన అబ్దుల్‌ మజీద్‌ 2012లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదే విధంగా, నిందితులిద్దరూ రాష్ట్రంలోని పలువురి నుంచి కోట్లాది రూపాయలను మోసపూరితంగా వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి.  

మరిన్ని వార్తలు