అఫ్తాబ్ డ్రగ్ అడిక్ట్.. గంజాయి మత్తులోనే శ్రద్ధను హత్యచేసి.. రాత్రంతా శవం పక్కనే..

18 Nov, 2022 14:58 IST|Sakshi

న్యూఢిల్లీ: శ్రద్ధ వాకర్ హత్య కేసు విచారణలో రోజురోజుకు షాకింగ్ నిజాలు తెలుస్తున్నాయి. ఈ కేసులో నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా తాను మత్తు పదార్థాలకు బానిసైనట్లు విచారణలో చెప్పాడని సంబంధిత వర్గాలు తెలిపాయి. శ్రద్ధ హత్య జరిగిన రోజు(మే 18) ఇద్దరి మధ్య గొడవ జరిగిందని, అనంతరం బయటకు వెళ్లిన అఫ్తాబ్‌ గంజాయి తాగి తిరిగి ఇంటికి వచ్చి ఆమెను గొంతునులుమి హత్య చేసినట్లు విచారణలో చెప్పుకొచ్చాడని తెలుస్తోంది.

తరచూ గంజాయి తాగుతున్నందుకు శ్రద్ధ తనను తిట్టేదని అఫ్తాబ్ విచారణలో పేర్కొన్నాడు. హత్య జరిగిన రోజు ఖర్చుల విషయంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగిందని వివరించాడు. డబ్బులు లేక ఇద్దరం ఇబ్బందిపడ్డామని, ముంబై నుంచి తమ లగేజ్ ఢిల్లీకి ఎలా తీసుకురావాలని రోజంతా పోట్లాడుకున్నామని తెలిపాడు. 

గొడవ అనంతరం గంజాయి మత్తులోనే శ్రద్ధను తాను చంపానని, కావాలని హత్య చేయలేదని అఫ్తాబ్ పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది. మే 18 రాత్రి 9నుంచి 10 గంటల సమయంలో శ్రద్ధను హత్య చేసిన తర్వాత రాత్రంగా గంజాయి సిగరెట్ తాగుతూ మృతదేహం పక్కనే ఉన్నట్లు అఫ్తాబ్ వివరించాడు. హత్య అనంతరం శ్రద్ధ మృతదేహాన్ని 35 ముక్కలు చేసిన అఫ్తాబ్ వాటిని 300 లీటర్ల ఫ్రిజ్‍లో దాచాడు. తర్వాత శరీర భాగాలను సమీపంలోని అడవితో పాటు మరికొన్ని ప్రదేశాల్లో పడేశాడు.

ఢిల్లీ మెహ్రౌలీలో జరిగిన శ్రద్ధ హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. నిందితుడు అఫ్తాబ్‌ పోలీస్ కస్టడీని కోర్టు గురువారం మరో ఐదు రోజులు పొడిగించింది. నార్కో టెస్టుకు అనుమతి ఇచ్చింది. ఈ కేసులో శ్రద్ధ శరీర భాగాలు ఇంకా అన్నీ దొరకలేదు. ఆమెను ముక్కలు చేసేందుకు ఉపయోగించిన కత్తి, మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకోవాల్సి ఉంది. దీనికి ఇంకా చాలా రోజులు పడుతుందని పోలీసులు చెబుతున్నారు.
చదవండి: వివాహేతర సంబంధం.. భర్తను చంపి గుండెపోటుగా చిత్రీకరణ.. మూడు నెలల తర్వాత..

మరిన్ని వార్తలు