ఆప్ కౌన్సిలర్‌ను అతి సమీపం నుంచి కాల్చి చంపిన దుండగుడు.. జిమ్ చేస్తుండగా దాడి..

1 Aug, 2022 11:14 IST|Sakshi

చండీగఢ్‌: పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్‌ మహమ్మద్ అక్బర్ దారుణ హత్యకు గురయ్యాడు. మాలెర్‌కోట్ల జిల్లాలో ఆదివారం  ఈ ఘటన జరిగింది. అక్బర్ జిమ్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అతడ్ని  అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతని శరీరంలోకి బుల్లెట్ దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు.

జిమ్‌లోకి ఓ వ్యక్తి వచ్చినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. అక్బర్ అతని దగ్గరకు వెళ్లాడు. అప్పుడు నిందితుడు వెంటనే తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ హత్యతో ఇద్దరికి సంబంధం ఉందని సీసీటీవీ ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టినట్లు తెలిపారు.

అయితే వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబ్‌లో ఆమ్‌ ఆద్మీ పార్టీనే అధికారంలో ఉంది. ఆ పార్టీకే చెందిన మున్సిపల్ కౌన్సిలర్ దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపింది.
చదవండి: ప్రాణాల మీదకు తెచ్చిన డీజే.. కరెంటు షాక్‌తో 10 మంది మృతి

మరిన్ని వార్తలు