12 గంటల్లోనే ఛేదించారు

29 Oct, 2020 07:19 IST|Sakshi
కారులో బందీగా ఉన్న డాక్టర్‌ హుస్సేన్‌

నగరంలోని దంత వైద్యుడి కిడ్నాప్‌ సుఖాంతం..

ఏపీ పోలీసుల సహకారంతో రాప్తాడులో ఆచూకీ లభ్యం

హైదరాబాద్‌లో ఆరుగురి అరెస్టు, రాప్తాడులో ఒకరి పట్టివేత

చాలెంజ్‌గా తీసుకుని స్వయంగా పర్యవేక్షించిన సీపీ సజ్జనార్‌

సాక్షి, హైదరాబాద్‌/ సాక్షి, అమరావతి/రాప్తాడు (అనంతపురం జిల్లా): హైదరాబాద్‌లోని ఓ దంత వైద్యుడి కిడ్నాప్‌ కేసును సై బరాబాద్‌ పోలీసులు 12 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో మొత్తం 13 మంది నిం దితుల్లో ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆరుగురిని హైదరాబాద్‌లోనే పట్టుకోగా, మరొకరిని అనంతపురం జిల్లా పోలీసుల సహకారంతో రాప్తాడు మండలం వద్ద అరెస్టు చేశారు. మిగిలిన వారు పరారీలో ఉన్నారు. సినీ ఫక్కీలో జరిగిన ఈ కేసు వివరాలను గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో సీపీ సజ్జనార్‌ బుధవారం మీడియాకు వివరించారు.

సులువుగా డబ్బు సంపాదించాలని..
కిస్మత్‌పుర గ్రామంలో నివాసముంటున్న దంతవైద్యుడు బెహజాత్‌ హుస్సేన్‌ బండ్లగూడలో ఇటీవల మూడు అంతస్తుల భవనం నిర్మాణం పనులు చేపట్టారు. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో డెంటల్‌ క్లినిక్‌ను ఇటీవల ప్రారంభించారు. నిర్మాణంలో ఉన్న మిగతా ఫ్లోర్‌లు అద్దెకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. కాగా, ఆస్ట్రేలియాలో ఉండే హుస్సేన్‌ భార్య సమీప బంధువు ముస్తాఫా రెండు నెలల కింద హైదరాబాద్‌ వచ్చాడు. ఆ సమయంలో బండ్లగూడలోని హుస్సేన్‌ డెంటల్‌ క్లినిక్‌పై అంతస్తులోని ఫ్లాట్లు అద్దెకు ఉన్నాయని ముస్తాఫా తెలుసుకున్నాడు. అయితే ఆస్ట్రేలియాలోని ఓ కంపెనీ ఆర్థిక సలçహాదారుగా పనిచేసే ముస్తాఫా అక్కడ విలాసవంతమైన జీవనానికి అలవాటుపడి బ్యాంకుల్లో చాలా రుణాలు చేశాడు. అవి చెల్లించలేక 2019 మార్చిలో భారత్‌కు తిరిగి వచ్చాడు. పుణే, హైదరాబాద్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేయాలని భావించి ఆస్ట్రేలియాలో తనతో పాటు పనిచేసిన ముబసిర్‌ అహ్మద్‌ అలియాస్‌ కాలేద్‌తో కలసి ఆయా ప్రాంతాల్లో తిరిగాడు. అయితే చాలా అప్పులు ఉండటంతో ఎలాగైనా సులువుగా డబ్బు సంపాదించేందుకు హుస్సేన్‌ను కిడ్నాప్‌ చేసి డబ్బులు లాగొచ్చని పథకం రచించాడు.

పని మనిషిని పెట్టి మరీ..
ఫలక్‌నుమాకు చెందిన మహమ్మద్‌ రహీంను హుస్సేన్‌ ఫ్లాట్‌లో హౌస్‌కీపర్‌గా పని కుదుర్చుకుని దంత వైద్యుడి కదలికలపై ముస్తాఫా నిఘా పెట్టాడు. ఈ క్రమంలోనే మంగళవారం మధ్యాహ్నం 1.15 గంటలకు వైద్యుడితో పాటు టెక్నీషియన్‌ మాత్రమే ఆ క్లినిక్‌లో ఉన్నట్లు రహీం ఫోన్‌లో దుండగులకు తెలిపా డు. కిడ్నాప్‌ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న పుణేకు చెందిన సుమిత్, అక్షయ్, విక్కీ, సల్మాన్‌లు బుర్ఖాలు ధరించి క్లినిక్‌లోకి వెళ్లా రు. బొమ్మ పిస్టల్‌తో బెదిరించి గాయపరి చా రు. టెక్నీషియన్‌ కాళ్లు, చేతులు కట్టేసి ము ఖానికి గుడ్డ కట్టారు. ఆ తర్వాత వైద్యుడిని ఆయన కారులోనే కూకట్‌పల్లిలోని ఎల్లమ్మ బండలో ఉంటున్న మహమ్మద్‌ ఇమ్రాన్, ఇర్ఫాన్‌ల ఇంటికి తీసుకెళ్లారు. మధ్యాహ్నం 2.10 గంటల సమయంలో వైద్యుడి కుటుం బసభ్యులకు రూ.10 కోట్లు ఇస్తే విడిచి పెడతామంటూ వాయిస్‌ మెసేజ్‌ పంపారు. అయి తే, ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వైద్యుడిని తీసుకెళ్లేందుకు కర్ణాటక ఉడిపికి చెందిన పునీత్, సంజయ్, సిరి, పృథ్వీల బృందం బొలెరో వాహనంలో రాత్రి 12 గంట ల సమయంలో బయల్దేరింది. కాగా, కిడ్నాప్‌ విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు పో లీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కిడ్నాపర్ల కారు అనంతపురం వైపు వెళ్తున్నట్లు నిర్ధారించుకుని, అనంతపురం ఎస్పీలకు సమాచారం అందించారు.

సజ్జనార్‌ పర్యవేక్షణలో 12 బృందాలు
కిడ్నాప్‌ విషయం తెలుసుకున్న సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వీసీ సజ్జనార్‌ చాలెంజ్‌గా తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా 12 బృందాలను పంపారు. దాదాపు 100 మందికిపైగా అధికారులు ఈ కేసును ఛేదించేందుకు రాత్రంతా పనిచేశారు. బండ్లగూడలోని డెంటల్‌ క్లినిక్‌ ప్రాంతంలో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా నం బర్లు గుర్తించారు. హౌస్‌కీపర్‌ రహీంను అదుపులోకి తీసుకున్నారు. ఆ వెంటనే కూకట్‌పల్లి ఎల్లమ్మ బండ వద్ద నివాసముండే మహమ్మద్‌ ఇమ్రాన్, ఇర్ఫాన్‌లను, రెడ్‌హిల్స్‌లో పుణేకు చెందిన సుమిత్, అక్షయ్, వికీ దత్తా షిండేలను అరెస్టు చేశారు. వీరిచ్చిన సమాచారం మేరకు బెంగళూరుకు వెళ్తున్న మార్గంలోని ఏపీ, కర్ణాటక పోలీసులకు వాహనం వివరా లు ఇవ్వడంతో నిఘా పెట్టారు. తెలంగాణ స రిహద్దులోనే దొరకాల్సిన వీరు తృటిలో తప్పించుకున్నారు. ఆ వెంటనే అనంతపురం ఎస్పీ సత్య యేసుబాబును అప్రమత్తం చేశారు.  

కిడ్నాపర్ల ఆట కట్టించిన ‘అనంత’పోలీసులు
తొలుత బొలెరో వాహనాన్ని అనంతపురం పోలీసులు ఆపే ప్రయత్నం చేయ గా, కిడ్నాపర్లు అతివేగంగా బెంగళూరు వైపు పోనిచ్చారు. దీంతో రాప్తాడు పోలీసులను అప్రమత్తం చేశారు. ఇటుకులపల్లి సీఐ విజయభాస్కర్‌గౌడ్, రాప్తాడు ఎస్‌ఐ పీవై ఆంజనేయులు రాప్తాడు మండలంలోని ప్రసన్నాయపల్లి వద్ద వాహన తనిఖీ చేశారు. దీంతో కిడ్నాపర్లు కుడి వైపు టర్న్‌ తీసుకుని  బుక్కచెర్ల వైపు వెళ్లారు. వెంటనే పోలీసులు కిడ్నాపర్ల కారును వెంబడించారు. అదే సమయంలో ఎస్‌ఐ ఆంజనేయులు అయ్యవారిపల్లి, బుక్కచెర్ల, జి.కొత్తపల్లి, గాండ్లపర్తి గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. దీంతో బుక్కచెర్ల గ్రామ సరిహద్దుల్లో రాళ్లు, ముళ్ల కంపలు అడ్డు పెట్టారు. అటునుంచి బుక్కచెర్ల చెరువు వైపు వెళ్లారు. అక్కడి నుంచి ముందుకు దారి లేకపోవడంతో కారును అక్కడే వదిలేసి పారిపోయారు. కిడ్నాపర్లను వెంబడిస్తూ వచ్చిన పోలీసులు వారిలో ఒక దుండగుడిని అదుపులోకి తీసుకోగా మిగిలిన వారు పరారయ్యారు. పోలీసులు కారు దగ్గరికి వెళ్లి చూడగా దంత వైద్యుడు హుస్సేన్‌ కాళ్లు, చేతులు కట్టేసి ఉండటాన్ని గుర్తించారు. కిరాతకంగా హింసించి, కాళ్లతో తొక్కి, చేతి గోళ్లు పీకేశారు. 

ఏపీ డీజీపీ అభినందన
దంత వైద్యుడిని సురక్షితంగా కాపాడి, కిడ్నాప్‌ చేసిన దుండగుడిని ధైర్యంగా పట్టుకున్నందుకు అనంతపురం జిల్లా పోలీసులను ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అభినందించారు. 

మరిన్ని వార్తలు