5.7 కేజీల బంగారం స్వాధీనం

14 Mar, 2021 05:22 IST|Sakshi

దాచేపల్లి (గురజాల): తెలంగాణ నుంచి ఆంధ్రాకు తరలిస్తున్న 5 కేజీల 700 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని గుంటూరు జిల్లా గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్‌ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. దాచేపల్లి మండలం పొందుగల చెక్‌పోస్టు వద్ద శనివారం ఉదయం 11 గంటల సమయంలో జరిపిన వాహనాల తనిఖీల్లో కారులో తరలిస్తున్న బంగారాన్ని పోలీసులు పట్టుకున్నారు.

హైదరాబాద్‌కు చెందిన లక్ష్మణ్, విజయ్‌నాథ్‌ అనే వ్యక్తులు ఈ బంగారాన్ని గుంటూరుకు తరలిస్తున్నారని విచారణలో వెల్లడైంది. ఈ బంగారం విలువ సుమారు రూ.2.47 కోట్లు ఉంటుందని డీఎస్పీ పేర్కొన్నారు. బంగారానికి సంబంధించి పత్రాలు సక్రమంగా లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. గురజాల సీఐ ఉమేష్, ఎస్‌ఐ బాలనాగిరెడ్డి పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు