మొన్న నాగరాజు.. నేడు వెంకటేశ్వర్‌రెడ్డి

20 Aug, 2020 14:34 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి/మేడ్చల్‌ : కోటి 10 లక్షల లంచం తీసుకొని దొరికిపోయిన కీసర తహసీల్దార్ నాగరాజు ఘటన మరువకముందే మరో రెవెన్యూ అవినీతి అధికారి పట్టుబడ్డాడు. అయితే ఈసారి నాగరాజు తరహాలో కోటి రూపాయలు కాకుండా 5వేల రూపాయలు లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీకి దొరికిపోయాడు. ఈ ఘటనతో తెలంగాణలో రెవెన్యూ అధికారుల తీరు ఏ మాత్రం మారలేదన్న విషయం బయటపడింది.(బ‌య‌ట‌ప‌డుతున్న కీస‌ర ఎమ్మార్వో అక్ర‌మాలు)

వివరాలు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వెంకటేశ్వర్‌రెడ్డి అనే వ్యక్తి సర్వేయర్‌ సూపరిండెంట్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. శంషాబాద్‌ తొండుపల్లిలోని 20 ఎకరాల స్థల వివాదంపై ఒక వ్యక్తిని 15వేల రూపాయలు లంచం డిమాండ్‌ చేశాడు.  కాగా బుధవారమే 10వేల రూపాయల లంచం అందుకున్న వెంకటేశ్వర్‌రెడ్డి గురువారం మరో 5వేల రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికిపోయాడు. వెంకటేశ్వర్‌రెడ్డి పనిచేస్తున్న కార్యాలయంతో పాటు అతని నివాసంలోనూ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.  

ఐటీశాఖకు లేఖ రాసిన ఏసీబీ
మరోవైపు తహసీల్దార్‌ నాగరాజు లంచం తీసుకున్న కోటి 10 లక్షల రూపాయల పై ఏసీబీ విచారణను వేగవంతం చేసింది. ఈ డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు.. వీరి వెనుక ఉన్న అసలు సూత్ర దారులు ఎవరు అన్న కోణంలో ఏసీబీ కేసును విచారిస్తుంది. ఈ ఘటనపై గురువారం ఏసీబీ ఐటి శాఖకు లేఖ రాసింది.  మనీ ట్రాన్స్ సెక్షన్ ఎక్కడి నుంచి జరిగిందో తెలపాలంటూ ఐటిశాఖను లేఖలో కోరింది.  నాగరాజుకు సంబంధించిన ఆస్తుల వివరాలపై కూపీ లాగుతున్న ఏసీబీ .. విదేశాల్లో సైతం పెట్టుబడులు పెట్టినట్టు తెలిపింది. (కీసర భూదందాలో రాజకీయ హస్తం!)

ఇదే విషయమై ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ మాట్లాడుతూ.. రెవెన్యూ శాఖ లో సరైన చర్యలు తీసుకోకపోవడం వల్లనే  ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకు మరిగారు. అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే ఏసీబీ కి ఫిర్యాదు చేయాలి. గతంలో నాగరాజు పనిచేసిన చోట రికార్డులను ఏసీబీ పరిశీలిస్తోంది. నాగరాజు కు మధ్యవర్తిత్వం వహించిన ఆంజిరెడ్డి ,శ్రీనాథ్ ఇంట్లో దొరికిన డాక్యుమెంట్లను పరీశీలిస్తున్నాం. నిందితులను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నాం. అంటూ తెలిపారు.

మరిన్ని వార్తలు