-

సోదాలు @30 గంటలు

11 Sep, 2020 03:15 IST|Sakshi
అదనపు కలెక్టర్‌ నగేశ్‌ను అరెస్ట్‌ చేసి తీసుకెళ్తున్న ఏసీబీ అధికారులు

మెదక్‌లోని అదనపు కలెక్టర్‌ ఇంట్లో విస్తృత తనిఖీలు

రూ. లక్ష నగదు, హార్ట్‌డిస్కులు, కీలక డాక్యుమెంట్ల స్వాధీనం

నర్సాపూర్‌ ఆర్డీఓ ఆఫీస్‌లో 28 లక్షల నగదు కూడా..

నగేశ్, ఆర్డీఓ, తహసీల్దార్, మరో ఇద్దరి అరెస్టు 

సాక్షి, మెదక్‌/మెదక్‌ రూరల్‌: మెదక్‌ అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌ ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం కూడా విస్తృతంగా సోదాలు నిర్వ హించారు. దాదాపు 30 గం టల పాటు సోదాలు నిర్వహిం చిన అధికారులు.. రూ.లక్ష నగదు, హార్డ్‌డిస్కులు, కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే.. నర్సా పూర్‌ ఆర్డీవో కార్యాలయంలో కూడా 20 గంటల పాటు జరిగిన సోదాల్లో రూ.28 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌ 112 ఎకరాలకు ఎన్‌ఓసీ కోసం రూ.1.12 కోట్ల లంచం కేసులో పట్టుబడిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం ఆరు గంటలకు ప్రారంభమైన సోదాలు.. గురువారం కూడా కొనసాగాయి. నగేశ్, ఆయన భార్య మమత, బంధువులు, ఇతర బినామీల పేరిట దొరి కిన పలు డాక్యుమెంట్లను క్షుణ్ణంగా పరిశీలించారు.

12 బృందాలు.. 12 చోట్ల సోదాలు
ఏసీబీ అధికారులు 12 బృం దాలుగా విడిపోయి ఏక కాలంలో 12 చోట్ల సోదాలు నిర్వహిం చారు. మాచవరంలోని అదనపు కలెక్టర్‌ నగేశ్‌ ఇంట్లో ఏసీబీ రంగారెడ్డి రేంజ్‌ డీఎస్పీలు సూర్యనారాయణ, ఫయాజ్‌ ఆధ్వర్యంలో సోదాలు జరిగాయి. డాక్యుమెంట్లన్నీ స్వాధీనం చేసుకున్నాక.. గురువారం ఉదయం 11.30 గంటలకు ఏసీ నగేశ్‌ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని అవినీతి నిరోధక శాఖ ప్రధాన కార్యాలయానికి తరలించారు. నర్సాపూర్‌ ఆర్డీఓ అరుణారెడ్డి, అప్పటి నర్సాపూర్‌ ఇన్‌చార్జి, ప్రస్తుత చిలప్‌చెడ్‌ తహసీల్దార్‌ సత్తార్, జూనియర్‌ అసిస్టెంట్‌ వసీంతోపాటు అడిషనల్‌ కలెక్టర్‌ బినామీ జీవన్‌గౌడ్‌ను సైతం అరెస్టు చేశారు.

 ఏసీ ఇంట్లో రూ.లక్ష .. ఆర్డీఓ ఇంట్లో రూ.28 లక్షలు
మాచవరంలోని అదనపు కలెక్టర్‌ ఇంట్లో సోదాల సందర్భంగా రూ. లక్ష నగదు, లింగమూర్తి సంతకం చేసిన 8 చెక్కులు, రూ.72 లక్షలకు సంబంధించి ఏసీ బినామీ జీవన్‌గౌడ్‌ పేరిట ఐదు ఎకరాల అగ్రిమెంట్‌తోపాటు పలు కీలక డాక్యుమెంట్లు లభించాయి. మరోవైపు హైదరాబాద్‌లోని నర్సాపూర్‌ ఆర్డీఓ అరుణారెడ్డి ఇంట్లో రూ.28 లక్షలు, అరకిలో బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

విచారణకు సహకరించని ఏసీ, ఆయన భార్య 
ఏసీబీ అధికారుల విచారణకు అదనపు కలెక్టర్‌ నగేష్‌తోపాటు ఆయన భార్య మమత సహకరించలేదని తెలిసింది. హైదరాబాద్‌ బోయిన్‌పల్లిలో ఉన్న బ్యాంక్‌ లాకర్‌ను తెరిచేందుకు ఆమెను తీసుకెళ్లారు. అయితే లాక్‌ తెరిచేందుకు కీ లేదంటూ బుకాయించారు. పైగా అధికారులకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదని సమాచారం. మెదక్‌లోని ఇంట్లో బీరువా కీ కూడా లేదని దురుసుగా సమాధానం చెప్పినట్లు చెబుతున్నారు. కాగా, అడిషనల్‌ కలెక్టర్‌ నగేశ్‌ బాధితులు గురువారం మెదక్‌ కలెక్టర్‌ను కలసి తమకు న్యాయం చేయాలని కోరారు. తమ భూములు ఇప్పించాలని వేడుకున్నారు. 

శాపనార్థాలు
అడిషనల్‌ కలెక్టర్‌ నగేష్‌ను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌కు తరలించే సమయంలో గ్రామానికి చెందిన చాకలి లక్ష్మి అక్కడకు చేరుకుని శాపనార్థాలు పెట్టింది. తాను చాకలి పని చేస్తానని.. దుస్తులు ఉతికేందుకు ఏసీ భార్య మమతను కలసినట్లు తెలిపారు. ఒక్కరికి నెలకు రూ. 200 తీసుకుంటామని చెబితే.. రూ.100 ఇస్తామని ఏసీ భార్య బేరమాడిందని.. ఆ తర్వాత తెల్లారి రా అని పంపించినట్లు తెలిపింది. అయితే ఇదే గ్రామానికి చెందిన మరో చాకలి వచ్చి.. ఈ ఇల్లు తన పరిధిలోకి వస్తుందని గొడవకు దిగినట్లు వివరించింది. ఏసీ భార్య తనపై మెదక్‌ రూరల్‌ పోలీసులకు చెప్పి కేసు నమోదు చేయించినట్లు వాపోయింది. తనతోపాటు కుటుంబీకులు ముగ్గురిపై కేసు పెట్టగా.. బెయిల్‌పై బయటకొచ్చినట్లు వివరించింది. స్థాయిలో ఉన్న అధికారికి ఇది తగునా అంటూ.. సరైన శాస్తే జరిగిందని సదరు మహిళ శాపనార్థాలు పెట్టింది.

మరిన్ని వార్తలు