ఏసీబీకి చిక్కిన సీనియర్‌ ఆడిటర్‌ 

2 Mar, 2021 04:01 IST|Sakshi
చిలకలూరిపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తున్న ఏసీబీ అధికారులు

వైఎస్సార్‌ జిల్లాలో రూ.5 వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు 

చిలకలూరిపేట సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు

సాక్షి, అమరావతి/కడప అర్బన్‌/చిలకలూరిపేట: వైఎస్సార్‌ జిల్లా ఆడిట్‌ కార్యాలయంలో సీనియర్‌ ఆడిటర్‌గా పనిచేస్తున్న అబ్దుల్‌ జబ్బార్‌ రూ.5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ పి.కంజాక్షన్‌ అందించిన వివరాలు.. మైదుకూరు మండలం తువ్వపల్లెకు చెందిన పెద్ద వెంకటయ్య కడప ఇరిగేషన్‌ సర్కిల్లో సబార్డినేట్‌గా పనిచేసి పదవీవిరమణ చేశారు. తనకు రావాల్సిన గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్స్‌కు సంబంధించిన ఫైలును జిల్లా ఖజానా అధికారికి పంపించే విషయమై అబ్దుల్‌ జబ్బార్‌ను సంప్రదించారు. ఇందుకోసం రూ.5 వేలు లంచం డిమాండ్‌ చేశారు.  బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు దాడి చేసి జబ్బార్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.  

రూ.80,120 స్వాదీనం గుంటూరు జిల్లా చిలకలూరిపేట సబ్‌ 
రిజిస్ట్రార్‌ కార్యాలయంపై ఏసీబీ అధికారులు సోమవారం దాడి చేశారు.  కార్యాలయంలో అధిక మొత్తంలో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఫిర్యాదు రావడంతో గుంటూరు ఏసీబీ డీఎస్పీలు వెంకట్రావు, ప్రతాప్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఈ దాడులు జరిగాయి. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి చేరుకున్న అధికారులు రికార్డులను తనిఖీ చేశారు. ఆ సమయంలో కార్యాలయం లోపల ఉన్న 10 మంది స్టాంప్‌ వెండరు, ప్రయివేటు ఉద్యోగుల వద్ద నుంచి రూ.80,120ను ఏసీబీ అధికారులు 
స్వాదీనం చేసుకున్నారు. 

మరిన్ని వార్తలు