అవినీతిపై పంజా విసిరిన ఏసీబీ

12 Jan, 2021 04:06 IST|Sakshi

రాష్ట్రంలో ఒకేరోజు ఐదు కేసులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పలువురు అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) పంజా విసిరింది. సోమవారం ఒక్కరోజునే రాష్ట్రంలో ఐదు వేర్వేరు కేసులను నమోదు చేసింది. సంబంధిత వివరాలను ఏసీబీ డీజీ పీఎస్సార్‌ ఆంజనేయులు వివరించారు. నీటిపారుదల శాఖ ధవళేశ్వరం సర్కిల్‌ సీనియర్‌ అసిస్టెంట్‌ పల్లంకుర్తి పద్మారావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ..దాడులు నిర్వహించింది. ధవళేశ్వరం, రాజమండ్రి తదితర ప్రాంతాల్లోని కార్యాలయాలు, ఇళ్లలోనూ ఏసీబీ బృందాలు సోదాలు జరిపాయి. 1997లో జూనియర్‌ అసిస్టెంట్‌గా విధులు చేపట్టి 2010 జూన్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పదోన్నతి పొందారు. పద్మారావు, ఆయన కుటుంబసభ్యుల పేరుతో రూ.10లక్షల విలువైన బంగారంతో సహా..రూ.కోటి 2లక్షల, 35 వేల అక్రమాస్తులు ఉన్నట్టు ఏసీబీ గుర్తించింది. పద్మారావును రాజమండ్రి ఏసీబీ స్పెషల్‌ జడ్జి కోర్టులో హాజరుపర్చనున్నారు. 

రూ.51వేలు లంచం తీసుకుంటూ దొరికిన లైన్‌మెన్‌ 
ప్రకాశం జిల్లా దర్శి మండలం రాజంపల్లి గ్రామ విద్యుత్‌ లైన్‌మెన్‌ వాన్కుడావత్‌ లక్ష్మా నాయక్‌ రూ.51వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పోకూరి సుబ్బారావుకు, ఆయన బంధువులకు వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడానికి లైన్‌మెన్‌ రూ.లక్షా వెయ్యి డిమాండ్‌ చేశాడు. అడ్వాన్సుగా రూ.50వేలు తీసుకున్నాడు. మిగిలిన రూ.51వేలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లైన్‌మెన్‌ నాయక్‌ను నెల్లూరు ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు.  

లంచం తీసుకుంటూ పట్టుబడిన వీఆర్వో 
విజయనగరం జిల్లా బలిజిపేట మండలం అమపపల్లి గ్రామానికి చెందిన వీఆర్వో పక్కి గోవింద్‌ను పట్టాదార్‌ పాస్‌ పుస్తకం ఇవ్వడానికి గానూ ఓ రైతునుంచి రూ.4వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్వోను విశాఖపట్నం ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తారు. అలాగే అనంతపురం రిజి్రస్టేషన్‌ కార్యాలయం, విజయవాడ రూరల్‌ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్‌) డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కార్యాలయంలో ఏసీబీ ప్రత్యేక బృందాలు ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. ఆయా కార్యాలయాల్లో పలు అక్రమాలను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. 

మరిన్ని వార్తలు