ఏసీబీ వలలో సబ్‌రిజిస్ట్రార్‌

5 Jun, 2021 05:10 IST|Sakshi
నగదుతో పట్టుబడ్డ సబ్‌రిజిస్ట్రార్‌ దామోదరం, డాక్యుమెంట్‌ రైటర్‌ రాంబాబు

రూ.1,50,000 తీసుకుంటూ పట్టుబడ్డ వైనం 

పాకాల (చిత్తూరు జిల్లా): మార్టిగేజ్‌ రిజిస్ట్రేషన్‌ పత్రాలను ఇచ్చేందుకు లంచం తీసుకుంటున్న ఓ సబ్‌–రిజిస్ట్రార్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏసీబీ డీఎస్పీ అల్లాభక్ష్  తెలిపిన వివరాల మేరకు.. పూతలపట్టు మండలం పేటమిట్టకు చెందిన గల్లా దామోదరప్రసాద్‌ తన 6.69 ఎకరాల భూమిని తాకట్టుపెట్టి పాకాల మండలం నేండ్రగుంటకు చెందిన వి.నానిప్రసాద్‌ వద్ద రూ.46 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. గత నెల 31వ తేదీన రిజిస్ట్రేషన్‌ అనంతరం నానిప్రసాద్‌కు మార్టిగేజ్‌ పత్రాలను ఇచ్చేందుకు పాకాల సబ్‌రిజిస్ట్రార్‌ దామోదరం రూ.2 లక్షల లంచాన్ని డిమాండ్‌ చేశాడు.

ఈ క్రమంలో రూ.1 లక్షా 50 వేలు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.  అయితే.. నానిప్రసాద్‌ గురువారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. శుక్రవారం నానిప్రసాద్‌ సబ్‌–రిజిస్ట్రార్‌కు నగదు అందజేశాడు. ఆ నగదును డాక్యుమెంట్‌ రైటర్‌ రాంబాబుకు ఇచ్చి సబ్‌–రిజిస్ట్రార్‌ దాచమన్నాడు. దీంతో ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా రాంబాబును పట్టుకుని డబ్బును స్వాధీనం చేసుకున్నారు. సబ్‌–రిజిస్ట్రార్‌ను, డాక్యుమెంట్‌ రైటర్‌ను అరెస్టు చేశారు. ఏసీబీ అడిషనల్‌ ఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ అల్లాభ„Š  తెలిపారు. ఏసీబీ డీఎస్పీ జనార్దన్‌నాయుడు, ఇన్‌స్పెక్టర్‌ తనీమ్, ఎస్‌ఐ విష్ణువర్థన్, సిబ్బంది శ్రీనివాస్, సారథి పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు