సీఐ విచారణ: స్పృహ తప్పిన నిందితుడు 

16 May, 2021 08:23 IST|Sakshi

హుటాహుటిన ఆసుపత్రికి  తరలించిన పోలీసులు

థర్డ్‌ డిగ్రీ ప్రయోగించాడంటున్న బాధిత కుటుంబసభ్యులు

ఘటనపై తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఆరా 

పామిడి(అనంతపురం జిల్లా): స్థానిక సీఐ శ్యామ్‌రావు మరో వివాదానికి తెరలేపారు. ఓ కేసు విచారణలో నిందితుడిని స్టేషన్‌కు పిలిపించి, థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడంతో అతను కాస్త అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వివరాలు ఇలా... పామిడిలోని నాయీ బ్రాహ్మణ కాలనీలో స్థల వివాదానికి సంబంధించి ఈ నెల 13న పురుషోత్తం వర్గీయులు జరిపిన దాడిలో రఘునాథ్, చౌడప్ప గాయపడిన వైనం విదితమే. ఈ కేసులో పురుషోత్తం, పుల్లయ్య, భీమన్న, డ్రైవర్‌ సూరి, కృష్ణ, మహేష్, నాగేంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కేసు విచారణలో భాగంగా శనివారం నిందితులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించారు. అదే రోజు రాత్రి సీఐ తనదైన శైలిలో విచారణ చేపట్టడంతో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న పురుషోత్తం ఒక్కసారిగా అపస్మారక స్థితికి చేరుకున్నాడు. వెంటనే అప్రమైతమైన పోలీసులు అతడిని స్థానిక ఓ ప్రైవేట్‌ క్లినిక్‌లో చేరి్పంచి, ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాత్రిరాత్రి అనంతపురానికి తరలించారు. సీఐ థర్డ్‌ డిగ్రీ ప్రయోగించడం వల్లనే ఈ ఘటన చోటు చేసుకుందంటూ ఈ సందర్భంగా పురుషోత్తం కుటుంబసభ్యులు ఆరోపించారు.

అయితే తాను ఎలాంటి థర్డ్‌ డిగ్రీ ప్రయోగించలేదని, విచారణ సమయంలోనే అతను స్పృహ తప్పి పడిపోయాడంటూ సీఐ పేర్కొన్నారు. కాగా, ఆది నుంచి సీఐ శ్యామ్‌రావు తీరు వివాదాస్పదంగానే ఉంటోంది. గతంలో ఇతను పనిచేసిన అనంతపురంలోనూ తన పనితీరుతో పలు వివాదాలకు తావిచ్చినట్లుగా ఆరోపణలు న్నాయి. కాగా, తాజా ఘటనపై సీఐతో తాడిపత్రి డీఎస్పీ చైతన్య ఆరా తీసినట్లు సమాచారం.

చదవండి: అడ్డగోలు దోపిడీ: సీటీ ‘స్కామ్‌’     
రాష్ట్రానికి రాబందులా చంద్రబాబు

మరిన్ని వార్తలు