వీడిన మహిళ హత్య మిస్టరీ 

1 Oct, 2020 08:48 IST|Sakshi
కల్పనారెడ్డి హత్య వివరాలను వెల్లడిస్తున్న సీఐ నరసింహారావు (ఇన్‌సెట్‌) కల్పనారెడ్డి (ఫైల్‌)

నిందితుడు చీరలదుకాణం యజమాని

ఒంటరి మహిళపై కన్నేసిన కామాంధుడు

అదును చూసి అత్యాచారానికి యత్నం

ప్రతిఘటించడంతో అంతమొందించిన వైనం 

ముదిగుబ్బ(అనంతపురం జిల్లా): దొరిగిల్లుకు వెళ్లే దారిలో కల్వర్టు కింద మూడు నెలల కిందట వెలుగుచూసిన మహిళ హత్య మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈమెను హత్య చేసింది ధర్మవరంలోని చీరల దుకాణం నిర్వాహకుడని తేలింది. మృతదేహం తరలింపు, పెట్రోలు పోసి తగులబెట్టడానికి నిందితుడికి సహకరించిన భార్య, అతని స్నేహితుడిని అరెస్ట్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను నల్లమాడ సీఐ ఎస్‌.వి.నరసింహారావు బుధవారం ముదిగుబ్బ పోలీస్‌ స్టేషన్‌లో మీడియాకు వెల్లడించారు. (చదవండి: ‘ఇంట్లో’ దొంగలు..)

జూలై ఐదో తేదీన దొరిగిల్లుకు వెళ్లే దారిలోని కల్వర్టు కింద ఎవరో మహిళపై పెట్రోలు పోసి తగులబెట్టారని స్థానికుల ద్వారా సమాచారం అందడంతో పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. కాలిపోయిన మహిళ ఆనవాళ్లను మీడియా, సోషల్‌ మీడియా ద్వారా గమనించిన ధర్మవరానికి చెందిన జగన్నాథ్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో వచ్చి ఆ శవం తన కూతురు కల్పనారెడ్డి(32)దని పోలీసులకు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తుండగా నిందితుడు చింతల రాయుడు, భార్య హేమలత, అతని స్నేహితుడు జగదీష్‌ ముదిగుబ్బ పోలీస్‌ స్టేషన్‌లో మంగళవారంలొంగిపోయారు. బుధవారం వీరిని అరెస్ట్‌ చూపారు. (చదవండి: ఢిల్లీ చూడాలని.. 15 ఏళ్ల బాలిక..)

హత్యకు దారితీసిందిలా.. 
ధర్మవరానికి చెందిన ఫిజియోథెరపిస్ట్‌ కల్పనారెడ్డికి బత్తలపల్లి మండలం గుమ్మళ్లకుంటకు చెందిన వ్యక్తితో 13 ఏళ్ల కిందట వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. అనంతరం వీరు ధర్మవరానికి మకాం మార్చారు. కొంత కాలం తర్వాత భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. దీంతో కల్పనారెడ్డి భర్త నుంచి విడిపోయింది. భర్త కుమారుడిని తీసుకుని స్వగ్రామానికి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కల్పనారెడ్డి ఒక్కతే ధర్మవరంలో నివాసం ఉంటోంది.  ఈమె చీరల కోసం చింతలరాయుడు అనే వ్యక్తికి  చెందిన దుకాణానికి తరచూ వెళ్లేది. చీటీల విషయంలో కూడా ఇతడితో పరిచయం ఉంది.  ఒంటరిగా ఉంటోందని తెలిసి చింతలరాయుడు ఆమెపై కన్నేశాడు. అదునుకోసం చూస్తూ వచ్చాడు. లాక్‌డౌన్‌ సమయంలో జూన్‌ 29న మధ్యాహ్నం కల్పనారెడ్డి షాప్‌కు వచ్చింది. అప్పుడు అక్కడ చింతలరాయుడు తప్ప ఎవ్వరూ లేరు.  షాప్‌ మూసే సమయమైందంటూ ఆమెను లోపలే ఉంచి షట్టర్‌ వేశాడు. అనంతరం మంచి చీరలు చూపిస్తానని లోపలి గదిలోకి తీసుకెళ్లి అత్యాచారానికి ప్రయతి్నంచగా ఆమె ప్రతిఘటించింది. తన వారితో చెప్పి నీ అంతు చూస్తానని బెదిరించడంతో చింతలరాయుడు ఆమెకు ఆ అవకాశం ఇవ్వకూడదనుకున్నాడు. వెంటనే ఆమె వేసుకున్న స్కార్‌్ఫ, టవల్‌తో ముఖానికి గట్టిగా చుట్టి ఊపిరి ఆడకుండా అదిమిపట్టి హత్య చేశాడు.  

ఆనవాళ్లు దొరకకూడదని.. 
మరుసటి రోజు తన స్నేహితుడు జగదీష్‌, భార్యకు చింతలరాయుడు జరిగిన విషయం చెప్పాడు. కేసు తమ మెడకు చుట్టుకోకుండా ఉండేందుకు ఆనవాళ్లు చెరిపేసే ప్రయత్నం చేశారు. మృతదేహాన్ని అట్టతో ప్యాకింగ్‌ చేసి ముదిగుబ్బ మండలం దొరిగిల్లు ఘాట్‌లో ఉన్న కల్వర్ట్‌ కింద పడేసి వెళ్లిపోయారు. తరువాత శవాన్ని ఎవరైనా గుర్తు పడితే దొరికిపోతామని భయపడి జూలై ఒకటో తేదీన మళ్లీ కల్వర్టు వద్దకు వెళ్లి పెట్రోలు పోసి తగులబెట్టారు. మహిళ హత్యకు గురైన విషయం అదే నెల ఐదో తేదీన వెలుగులోకి వచ్చింది. పోలీసుల దర్యాప్తు వేగవంతమవడంతో నిందితులు  ముగ్గురూ సెప్టెంబర్‌ 29న పోలీసుల ఎదుట లొంగిపోయి, నేరాన్ని ఒప్పుకున్నారు. నిందితులు చింతలరాయుడు, జగదీష్‌లు ఉపయోగించిన ద్విచక్ర వాహనాలు, హతురాలు కల్పనారెడ్డి స్కూటర్‌ను స్వా«దీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. ముగ్గురు నిందితుల్ని బుధవారం రిమాండ్‌కు తరలించామని చెప్పారు. 

మరిన్ని వార్తలు