కారు హారన్‌ మోగించాడని అంతమొందించారు

27 May, 2021 10:53 IST|Sakshi
కేసు వివరాలు వెల్లడిస్తున్న కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్‌

బ్యాంకు ఉద్యోగి హత్య కేసులో నిందితుల అరెస్ట్‌  

కర్నూలు: తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా మానవపాడు ఎస్‌బీఐ శాఖ ఫీల్డ్‌ ఆఫీసర్‌గా పనిచేస్తున్న గుట్టపాటి ముని మహేశ్వరరెడ్డి హత్య కేసు మిస్టరీని 4వ పట్టణ పోలీసులు ఛేదించారు.  బండి ఆత్మకూరు మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన ముని మహేశ్వరరెడ్డి కర్నూలు నగరంలోని సంతోష్‌ నగర్‌ వెనుక వైపు ఉన్న విజయ లక్ష్మీ నగర్‌లో ఇళ్లు నిర్మించుకుని స్థిరపడ్డాడు. వీరి ఇంటి వరుసలోనే కొంత దూరంలో తెలుగు చంద్రకాంత్‌ ఇళ్లు అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. ఈ నెల 14వ తేదీ రాత్రి మహేశ్వరరెడ్డి ఇంటికి కారులో వెళ్తూ.. చంద్రకాంత్‌ ఇంటి ముందు దారికి అడ్డంగా ఉన్న కారును పక్కకు తీయాలని హారన్‌ను కొట్డాడు.

అయితే హారన్‌ మోగించాడనే కోపంతో ఇరువురు తిట్టుకోవడం, తోసుకోవడం జరిగింది. కొద్ది సేపటి తర్వాత ఇంటి ముంగిట ఉన్న మహేశ్వరరెడ్డిని గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసి కత్తులతో పొడిచి హత్య చేశారు. మృతుడి భార్య రామేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్కా ఆధారాలతో నిందితులు బెస్త చంద్రకాంత్, బెస్త శ్రీకాంత్, పటాన్‌ రెహన్‌ఖాన్, పటాన్‌ ఇలియాస్‌ ఖాన్, షేక్‌ ఇమ్రాన్‌ బాషా, సొప్పారం ధనుంజయ్, కుమ్మరి రామదాస్‌ అలియాస్‌ రామిరెడ్డి తదితరులను సంతోష్‌ నగర్‌ జంక్షన్‌ వద్ద అరెస్ట్‌ చేశారు. వారు నేరానికి ఉపయోగించిన బొలొరో వాహనంతో పాటు రెండు వేటకొడవల్లు, పిడుబాకు స్వాధీనం చేసుకుని కర్నూలు డీఎస్పీ కేవీ మహేష్‌ ఎదుట హాజరుపరిచారు. బుధవారం సాయంత్రం 4వ పట్టణ సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్‌ఐలు గోపాల్‌రెడ్డి, చిరంజీవి, రామయ్యలతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించి డీఎస్పీ వివరాలను వెల్లడించారు.

చదవండి: తన చావుకు వారే కారణమంటూ సెల్ఫీ వీడియో తీసి.. 
సాక్షి ఎఫెక్ట్‌: మాయలేడి అరెస్టు

మరిన్ని వార్తలు