నటి చిత్ర మరణంపై అనుమానాలు

21 Dec, 2020 08:53 IST|Sakshi

సాక్షి, చెన్నై: లైంగిక వేధింపులు, బెదిరింపుల వల్లే నటి వీజే చిత్ర బలవన్మరణానికి పాల్పడినట్లు ఆమె మామ రవిచంద్రన్‌ ఆరోపించారు. ఈ మేరకు చెన్నై కమిషనరేట్‌లో సమగ్ర విచారణ కోరుతూ ఫిర్యాదు చేశారు. కాగా  బుల్లితెర నటి చిత్ర బలన్మరణం గురించి తెలిసిందే. ఆమె ప్రియుడు, భర్త హేమనాథ్‌తో గొడవే ఈ బలన్మరణానికి కారణంగా పోలీసుల విచారణలో తేలింది. దీంతో హేమనాథ్‌ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో హేమనాథ్‌ తండ్రి, చిత్ర మామ రవిచంద్రన్‌ కమిషనరేట్‌లో ఓ ఫిర్యాదు చేశారు. (ప్రముఖ నటి వీజే చిత్ర ఆత్మహత్య)

ఆ వ్యక్తులు ఎవరో.. 
కొద్ది రోజులుగా చిత్ర టెన్షన్‌తో ఉన్నట్టు కుమారుడు హేమనాథ్‌ తన దృష్టికి తెచ్చాడని ఆ ఫిర్యాదులో రవిచంద్రన్‌ పేర్కొన్నారు. ఏదో నంబర్‌ నుంచి కాల్‌ వచ్చినట్టు, ఆ సమయంలో దూరంగా వెళ్లి ఆగ్రహంతో ఆమె మాట్లాడిన  అనంతరం ఆ నెంబర్‌ను డిలీట్‌ చేసినట్లు వివరించారు. చిత్ర వివాహం చేసుకోవడం ఎవరికో ఇష్టం లేనట్టుందని అనుమానం వ్యక్తం చేశారు. తన కుమారుడు హేమనాథ్‌ చెప్పిన విషయాలు బట్టి చూస్తుంటే అనుమానాలు ఉన్నాయన్నారు. ఆమెకు ఫోన్‌ చేసిన వారి గురించి విచారించాలని కోరారు. ఒత్తిళ్లకు తలొగ్గి చిత్ర తల్లి విజయ నోరు మెదపడం లేదన్నారు. చిత్ర మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని కమిషనర్‌ను కోరారు. అలాగే తన కుమారుడిని విడుదల చేయించాలని విన్నవించారు. హోటల్‌లోని సీసీ కెమెరా దృశ్యాలు మాయం కావడం బట్టి చూస్తే అనుమానాలకు బలం చేకూరుతున్నాయని అన్నారు.  (చచ్చిపో.. అంటూ చిత్రను ప్రేరేపించిన హేమనాథ్‌)  

మరిన్ని వార్తలు